
మధుమేహం వచ్చినట్లు నిర్ధారణైన తొలి ఐదేళ్లలోనే శరీర బరువును పది శాతం కంటే ఎక్కువ తగ్గించుకోగలితే వ్యాధిబారిన పడటాన్ని తప్పించుకోవచ్చని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మధుమేహులు దాదాపు 40 కోట్ల మంది ఉండగా.. భారత్లో వీరి సంఖ్య గణనీయంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత పలు రకాల జీవనశైలి మార్పులు చేసుకోవడం కూడా మనకు పరిచయమైన విషయమే. రోజుకు 700 కేలరీల ఆహారాన్ని 8 వారాలపాటు కొనసాగిస్తే వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుందని ఇటీవలి పరిశోధనలు కూడా చెబుతున్నాయి.
ఈ ఫలితం చాలాకాలంగా వ్యాధి తో బాధపడుతున్న వారిలో సగం మందిలో కనిపించగా.. కొత్తగా నిర్ధారణ అయిన వారిలో 90 శాతం వరకూ ఉంది. ఈ నేపథ్యంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు. తొలి ఐదేళ్లలో పది శాతం కంటే ఎక్కువ బరువు తగ్గిన వారికి సమస్యలు తక్కువగా ఉన్నట్లు తెలిసింది. పూర్తిస్థాయిలో కేలరీలను పరిమితం చేయడం, కడుపు కట్టుకుని వేగంగా బరువు తగ్గడం కంటే పది శాతం మాత్రమే తగ్గడమన్నది ఆచరణ సాధ్యమైన విషయమని, చాలామంది అనుసరించేందుకు వీలైందని, అందుకే తమ అధ్యయనానికి ప్రాధాన్యం ఏర్పడిందని డాక్టర్ హజీరా డంబా మిల్లర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment