
మొలకెత్తిన ఆశలు.. ఆవుతో హెచ్ఐవీ నయం!
హెచ్ఐవీ(హ్యుమన్ ఇమ్యూనోడెఫిషియెన్సీ వైరస్) సోకితే మరణం తప్పదనే మాటకు కాలం చెల్లబోతోందా?. హిందూవులు పవిత్రంగా పూజించే గోవు జన్యువులతో మనుషులకు సోకే హెచ్ఐవీని నయం చేయోచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవును. హెచ్ఐవీ వైరస్కు గోవు శరీరంలో అత్యతం వేగంగా ప్రతిరక్షకాలు తయారవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీంతో ప్రపంచాన్ని వేధిస్తున్న హెచ్ఐవీ చికిత్సలో కొత్త ఆశాలు రేగుతున్నాయి.
హెచ్ఐవీపై పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు.. నాలుగు ఆవు దూడలకు హెచ్ఐవీ ఇమ్యునోజన్స్ను ఇంజక్షన్ ద్వారా ఎక్కించారు. అనంతరం ఆ దూడల రక్తంలో హెచ్ఐవీ ప్రభావాన్ని నిరోధించే ప్రతిరక్షకం వెంటనే అభివృద్ధి కావడం వారిని విస్మయపరిచింది. వాటిలో ‘ఎన్సీ-సీఓడబ్ల్యూ 1’ అనే ప్రతిరక్షకం హెచ్ఐవీని ఎదుర్కోవడంలో ప్రభావవంతంగా పనిచేసినట్లు గుర్తించారు.
దీంతో ఆవులోని రోగ నిరోధక శక్తి ఇలాంటి ప్రతిరక్షకాలను వెంటనే ఎలా తయారు చేయగలుగుతుందో అర్థం చేసుకోవాలని వ్యుహం రచించారు. ప్రతిరక్షకాల ప్రక్రియను కనుగొంటే హెచ్ఐవీ సోకకుండా టీకాను అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. అమెరికాకు చెందిన స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ది ఇంటర్నేషనల్ ఎయిడ్స్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్ (ఐఏవీఐ), టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన ఈ పరిశోధన వివరాలు ‘నేచర్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.