
భారత్, చైనాలకు 'గ్లోబల్ టైమ్స్' హెచ్చరిక
బీజింగ్: పాశ్చాత్య దేశాలు సృష్టించిన పోటీ ఉచ్చులో పడొద్దని చైనా అధికార దినపత్రిక 'గ్లోబల్ టైమ్స్' భారత్, చైనాలను హెచ్చరించింది. నిగూఢ ఉద్దేశాలతో పాశ్చాత్య ప్రపంచం ఈ రెండు దేశాలను సహజ ప్రత్యర్థులుగా ప్రచారం చేస్తోందని ఆరోపించింది. చైనా ఎదుగులను అడ్డుకోవడానికి అమెరికా వ్యూహానికి మద్దతు పలకవద్దని కోరింది. భారత గణతంత్ర దినోత్సవానికి అమెరికా అధ్యక్షుడు ఒబామా ముఖ్య అతిథిగా హాజరైన నేపథ్యంలో సోమవారం ఓ వ్యాసంలో ఈ వ్యాఖ్యలు చేసింది.
భారత్, చైనాలు ఒకరిని దెబ్బతీసి ఒకరు లాభపడే పోటీని కోరుకోవడం లేదని, అయితే పాశ్చాత్య దేశాల ప్రభావంతో భారత్ ఆ పోటీవైపు సాగుతోందని పేర్కొంది. ఇరు దేశాలు తమ విభేదాలను చర్చలతో పరిష్కరించుకుని, సంబంధాలను పరిరక్షించుకోవాలని సూచించింది.