
జాదవ్కోసం అమెరికాలో పోరుబాట
వాషింగ్టన్: గూఢచర్యం కేసులో ఉరి శిక్ష పడి ప్రస్తుతం పాకిస్థాన్ జైలులో మగ్గుతున్న భారతీయ నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ కు భారత్ నుంచే కాకుండా అమెరికా నుంచి కూడా మద్దతు మొదలైంది. అమెరికాలోని భారతీయ అమెరికన్లు జాదవ్ కోసం నడుంకట్టారు. వైట్ హౌస్ పిటిషన్ను ప్రారంభించారు. తమ దేశంలో గూఢచర్యం నిర్వహించారని ఆరోపిస్తూ పాక్ జాదవ్కు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే.
దీంతో పాక్ చర్యను తీవ్రంగా ఖండిస్తూ భారత్ మొత్తం ఒక్కతాటిపై వచ్చింది. జాదవ్ను ఉరితీస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవాలని అక్కడ ఉన్న భారతీయులు వైట్ హౌస్ పిటిషన్ ప్రారంభించారు. ఎస్.ఎస్ అనే ఓ వ్యక్తి అమెరికా వైట్ హౌస్కు అర్జీలు పెట్టుకునే ‘వీ ది పీపుల్ పిటిషన్’అనే వైట్ హౌస్ వెబ్సైట్లో ఈ పిటిషన్ ప్రారంభించారు. మే 14లోపు దీనిపై లక్ష సంతకాలు చేస్తే ట్రంప్ పరిపాలన వర్గం స్పందిస్తుంది. జాదవ్పై పాక్ చేసిన ఆరోపణలు మొత్తం కూడా అసత్యాలంటూ ఈ పిటిషన్లో పేర్కొన్నారు.