లండన్: భారత్లో వైద్యవిద్యను పూర్తిచేసిన వారు తమ దేశంలో ప్రాక్టీస్ చేయకుండా బ్రిటన్ నిషేధం విధిస్తోంది. భారత్ తర్వాత పాకిస్థాన్, ఈజిప్టు, నైజీరియా దేశాలకు చెందిన డాక్టర్లపై కూడా బ్రిటన్లోని జనరల్ మెడికల్ కౌన్సిల్ (జీఎంసీ) నిషేధం విధిస్తోంది. అయితే ఈ దేశాల వారికంటే నిషేధానికి గురైన భారతీయ డాక్టర్ల సంఖ్యే ఎక్కువ. గత ఐదేళ్లలో భారత, పాక్లో శిక్షణ పొందిన 117 మంది డాక్టర్లపై బ్రిటన్లో పనిచేయకుండా జీఎంసీ ఆంక్షలు విధించింది. భారతీయ డాక్టర్లపై ఈ విధమైన వివక్ష కొనసాగుతోందని బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ తెలిపింది. తమను బ్రిటన్లో జనరల్ ప్రాక్టీషనర్లుగా చూడకుండా వివక్ష చూపుతున్నారని ఈ సంఘం వేసిన పిటిషన్ను లండన్ హైకోర్టు తోసిపుచ్చింది. అయితే ఈ విషయంలో ఒక విధానాన్ని రూపొందించాలని న్యాయమూర్తి అక్కడి ప్రభుత్వానికి సూచించారు.