సూచీ విధేయుడికే అందలం | Myanmar new president | Sakshi
Sakshi News home page

సూచీ విధేయుడికే అందలం

Mar 16 2016 1:14 AM | Updated on Sep 3 2017 7:49 PM

సూచీ విధేయుడికే అందలం

సూచీ విధేయుడికే అందలం

మయన్మార్‌లో చరిత్రాత్మక అధ్యాయం ఆవిష్కృతమైంది. దేశంలో దశాబ్దాలపాటు సాగిన సైనిక పాలనకు తెరపడింది.

మయన్మార్ కొత్త అధ్యక్షుడిగా టిన్ క్వా ఎన్నిక
♦ 1962 తర్వాత అధ్యక్ష పీఠంపై తొలిసారి సాధారణ పౌరుడు
 
 నేపిదా: మయన్మార్‌లో చరిత్రాత్మక అధ్యాయం ఆవిష్కృతమైంది. దేశంలో దశాబ్దాలపాటు సాగిన సైనిక పాలనకు తెరపడింది. 1962 తర్వాత దేశ తొలి పౌర అధ్యక్షుడిని పార్లమెంటు (దిగువసభ) ఎన్నుకుంది. మయన్మార్ కొత్త అధ్యక్షుడిగా ఆంగ్ సాన్ సూచీ  ప్రధాన అనుచరుడు, గతంలో ఆమెకు డ్రైవర్‌గా పని చేసిన టిన్ క్వా(69) ఎన్నికయ్యారు. పోలైన 652 ఓట్లలో క్వా 360 ఓట్లు సాధించారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సైనిక మద్దతుగల రిటైర్డ్ జనరల్ మింత్ స్వే(213 ఓట్లు), చిన్ ప్రాంత ఎంపీ హెన్రీ వాన్ థియో (79 ఓట్లు) సంయుక్తంగా దేశ ఉపాధ్యక్షులుగా వ్యవహరించనున్నారు. ఫలితంపై  ఎంపీలంతా పెద్దపెట్టున హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

అనంతరం క్వా మీడియాతో మాట్లాడుతూ ‘ఇది సోదరి ఆంగ్ సాన్ సూచీ విజయం’’అని అన్నారు. సైనిక మద్దతుగల ప్రస్తుత అధ్యక్షుడు థీన్ సేన్ స్థానంలో(పదవీకాలం ముగియడంతో) క్వా ఈ నెల 30న అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. ఆర్మీ కొత్త రాజ్యాగం వల్ల అధ్యక్షురాలయ్యే అవకాశం కోల్పోయిన సూచీ.. క్వా ఎన్నికతో పరోక్షంగా ఆ బాధ్యతల్ని చేపట్టేందుకు మార్గం సుగమమైంది. నవంబర్‌నాటి పార్లమెంటు ఎన్నికల్లో సూచీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్‌ఎల్‌డీ) ఘన విజయం సాధించిది. అయితే సైన్యం గతంలో మార్చిన రాజ్యాంగ నిబంధనల వల్ల అధ్యక్ష పదవికి అనర్హురాలయ్యారు. అధ్యక్ష పగ్గాలు చేపట్టే వ్యక్తి విదేశీయుల్ని పెళ్లి చేసుకొని ఉండరాదు. అలాగే ఆ వ్యక్తికి విదేశీ పౌరసత్వం ఉన్న పిల్లలు ఉండకూడదు. సూచీ భర్త మైఖేల్  బ్రిటిషర్ కావడం, ఆమె ఇద్దరు పిల్లలకు బ్రిటన్ పౌరసత్వం ఉండటంతో  అధ్యక్షురాలయ్యేందుకు అనర్హురాలయ్యారు. తనకు నమ్మకస్తుడైన వ్యక్తిని దేశాధ్యక్ష పీఠంపై కోర్చోబెట్టి అతని ద్వారా పరోక్షంగా పాలన సాగిస్తానని సూచీ గతంలోనే ప్రకటించారు. క్వాకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement