పాకిస్తాన్ మరో ఉత్తర కొరియా కానుందా? అణ్వాయుధ సంపత్తిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందా? ఆసియాలో మరోసారి అణుపోటీకి తెరతీస్తోందా? ఉత్తర కొరియా, చైనాలను పాకిస్తాన్కు సహకారం అందిస్తున్నాయా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి.
న్యూఢిల్లీ : ఆసియాలో మరోసారి అణ్వాయుధ పోటీకి పాకిస్తాన్ తెరతీస్తోందని అమెరికా సంచలన ప్రకటన చేసింది. ఒకేసారి తొమ్మిది కేంద్రాల్లో పాకిస్తాన్ అణ్వాయుధాల తయారీ చేస్తోందని అమెరికన్ సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉగ్రవాదులకు స్థావరంగా మరిన పాక్.. మరిన్ని న్యూక్లియర్ వెపన్స్ రూపొందిస్తే పరిస్థితులు భయానకంగా ఉంటాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్టులు అంచనా ప్రకారం.. పాకిస్తాన్ 130-140 న్యూక్లియర్ వార్హెడ్లను రూపొందించే పనిలో పడింది. వీటిని వీలైనంత త్వరగా తయారు చేసి.. సైన్యానికి అప్పగించాలని ప్రయత్నాలు చేస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఎక్కడెక్కడ?
పాకిస్తాన్ అణ్వాయుధాలను.. మొత్తం తొమ్మది కేంద్రాల్లో తయారు చేస్తోందని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. ఇందులో పంజాబ్ ప్రావిన్స్లో 4, సింధ్ ప్రావిన్స్లో 3, బలూచిస్తాన్లో 2 కేంద్రాల్లో ఆయుధాలు రూపొందుతున్నాయని ఎఫ్ఏఎస్ ప్రకటించింది.
ఇవే కేంద్రాలు
సైంటిస్టులు ఎం. కిర్స్టన్, రాబర్ట్ ఎస్. నోరిస్ల అంచనా మేరకు పాకిస్తాన్ ఆయుధ తయారీ కేంద్రాలు ఇవే.
- ఆక్రో గారిసన్, సింధ్ (ఇక్కడ ఆయుధాలను అండర్గ్రౌండ్లో దాచేందుకు అవకాశం ఉంది)
- గుజ్రన్వాలా గారిసన్, పంజాబ్ (ఆయుధాలను నిల్వ చేసుకోవచ్చు)
- ఖుజ్దార్ గారిసన్, బలూచిస్తాన్ (భూగర్భంలో ఆయుధాలను నిల్వ చేసుకునే అవకాశం ఉంది)
- మస్రూర్ డిపార్ట్మెంట్, కరాచీ (సింధ్) (ఇక్కడ శక్తివంతమైన బాంబులను నిల్వ చేసుకోవచ్చు)
- నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్, పంజాబ్ (ఎస్ఎస్ఎమ లాంచర్ అసెంబ్లీ, వార్హెడ్ల తయారీ,న నిల్వ)
- పానో అకిల్ గారిసన్, సింధ్ (ఆయుధాలను నిల్వ చేసుకోవచ్చు)
- సర్గోదా డిపార్ట్మెంట్, పంజాబ్ (శక్తివంతమైన బాంబులను నిల్వ చేసుకోవచ్చు, ఎఫ్-16 యుద్ధవిమానాలు దగ్గరలోనే ఉంటాయి)
- తర్బాలా అండర్గ్రౌండ్ డిపార్ట్మెంట్, ఖైబర్ (శక్తివంతమైన వార్మెడ్లను నిల్వ చేస్తారు)
- వాహ్ ఆర్డినెన్స్ ఫెసిలిటి, పంజాబ్ (వార్హెడ్ల తయారీ, నిల్వ)
ఎలా గుర్తించారు?
పాకిస్తాన్లో అణ్వాయుధాల తయారీ జరుగుతోందన్న అనుమానాలు కొద్దిగా కాలంగా ఉన్నట్లు ఎఫ్ఏసీ సైంటిస్టులు తెలిపారు. కమర్షియల్ శాటిలైట్లు అందించిన ఛాయాచిత్రాలు, నిపుణుల పరిశోధనలు, స్థానిక పత్రికల్లో ఇచ్చే వార్తల అధారంగా వీటిని గుర్తించనట్లు చెప్పారు. అంతేకాక భారత్లోని ఏ నగరాన్ని అయినా మేం చేరుకోగలమని సెప్టెంబర్ 20న పాకిస్తాన్ ప్రధాని షాహిద్ ఖాన్ అబ్బాసీ చేసిన ప్రకటన కూడా నమ్మకానికి బలాన్ని చేకూర్చిందని వారు తెలిపారు.