
కామెరాన్.. క్షమాపణ చెప్పండి!
భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో చెరిగిపోని రక్తపు మరకగా మిగిలిన 1919 జలియన్ వాలాబాగ్ దురాగతానికి బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ క్షమాపణలు చెప్పాలని యూకే భారతీయ కార్మికుల సంఘం అధ్యక్షుడు హార్స్ వెన్ కోరారు. 1914 కొమగాట మారు సంఘటనకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడ్ క్షమాపణలు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రధానమంత్రి క్షమాపణలు చెప్పాలని, అందుకు యూకే మొత్తం ఈ విషయంపై పోరాటం చేస్తామని అన్నారు. బ్రిటన్ క్షమాపణలు చెప్పడం వల్ల ప్రపంచదేశాలకు దాని మీద అభిప్రాయం మారుతుందని యూకే సిక్కు హక్కుల గ్రూప్ అధ్యక్షుడు జస్దేవ్ సింగ్ రాయ్ అన్నారు. 1919, 1925 దురాగతాలు సిక్కుల గుండెలపై ఎప్పటికీ చెరగని మచ్చలని అన్నారు.
ఓ వైపు కెనడా తన తప్పిదాన్ని గుర్తించి క్షమాపణలు చెబితే, బ్రిటన్ మాత్రం తన తప్పును గుర్తించకపోవడం బాగాలేదని వాపోయారు. మేయర్ ఎన్నికలలో సిక్కుల మద్దతు కోరిన కామెరాన్.. బ్రిటన్ తప్పిదాన్ని ఒప్పుకుని ఇప్పుడైనా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జలియన్ వాలా బాగ్ దురాగతంలో దాదాపు వెయ్యి మందికి పైగా భారతీయులు మరణించారు.