
బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ మరో పవర్ ఫుల్ పాత్రలో బిగ్స్క్రీన్పై అలరించనుంది. క్షణం చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ పాత్రలో మెప్పించిన ఈ భామ తాజాగా డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గాయత్రి’ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతికి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఇప్పటికే ఆకట్టుకోగా తాజాగా చిత్ర బృందం అనసూయ పాత్ర పరిచయ పోస్టర్ను విడుదల చేసింది. అనసూయ ఈ చిత్రంలో శ్రేష్ట జయరాం అనే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్గా కనిపించనున్నారు. పోస్టర్పై ఆమె తీక్షణ చూపులు పాత్రపై ఆసక్తిని రేపుతోంది. కథలో ప్రాధాన్యత ఉండే పాత్ర అని తెలుస్తోంది.
ఈ పోస్టర్ని అనసూయ తన ట్విటర్ పేజిలో ‘వెయ్యి గన్నుల కన్నా పెన్ను గొప్పది.. ‘గాయత్రి’ మూవీ శ్రేష్ట జయరాం పరిచయం’’ అంటూ పోస్ట్ చేశారు. దీనికి నెటిజన్లు.. ‘‘మీరు ఇలాంటి పాత్రలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం..’’ అని రిప్లైలు ఇస్తుండటంతో.. వారందరికీ అనసూయ రిప్లై ఇస్తూ.. ‘‘మీ ప్రోత్సాహం, ప్రోద్భలం ఉంటే తప్పకుండా’’ అంటూ మరో ట్వీట్ చేశారు.
వెయ్యి గన్నుల కన్నా పెన్ను గొప్పది Introducing Ms.#ShreshtaJayaram from #Gayatri #MB42 pic.twitter.com/hPcSSvZIX4
— Anasuya Bharadwaj (@anusuyakhasba) 23 January 2018
టీజర్లో 'రాయలసీమ రామన్న చౌదరి' తరహాలో మోహన్ బాబు ఓ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తుండటంతో చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. విష్ణు మంచు, శ్రియలు ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ ‘గాయత్రి’ చిత్రాన్ని డా.యమ్.మోహన్ బాబు తన సొంత బ్యానర్ అయిన శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్పై నిర్మిస్తున్నారు. నిఖిల విమల్, బ్రహ్మానందం ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.