
రైల్వే స్టేషన్లో నిల్చుని ఉన్న ఎంపీ రాజేంద్రన్ (పాత చిత్రం)
ప్రస్తుతం ఓ వైపు ఎండల తీవ్రత.. మరోవైపు ఎన్నికల సందర్భంగా రాజుకున్న రాజకీయ వేడితో కర్ణాటక ప్రజలకు ఊపిరి సలపడం లేదు. ఇలాంటి సమయంలో వినోదం కోసం సినిమాకు వెళదామన్నకున్న వారిని.. అక్కడ కూడా ఎన్నికల ఫీవర్ వదిలేలా లేదు. అయితే ప్రచారంలో భాగంగా మోదీని స్వయంగా చూడలేని ఆయన అభిమానులు థియేటర్లో చూసి తరించవచ్చు. అర్థంకాలేదు కదా.. అయితే స్టేట్మెంట్ 8/11 సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడండి.
స్టేట్మెంట్ 8/11..
కన్నడ నాట ఎన్నికల నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్న సమయంలో.. చరిత్రాత్మక నిర్ణయమైన డీమానిటైజేషన్ గురించి తెరకెక్కిన సినిమా విడుదల కానుండటం విశేషం. స్టేట్మెంట్ 8/11 పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో అచ్చం ప్రధాని నరేంద్ర మోదీలా ఉన్న ఎంపీ రాజేంద్రన్ అనే వ్యక్తి ఆయన పాత్ర పోషించారు. నవంబర్ 8 అర్ధరాత్రి అన్ని పాత 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రకటన సీన్తో ఈ సినిమా మొదలవుతుందట. అలాగే డీమానిటైజేషన్ వల్ల సమాజంపై ప్రభావం, వివిధ మార్పుల గురించి వచ్చిన మార్పుల గురించి ఈ సినిమాలో విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. అయితే ఈ సినిమా డీమానిటైజేషన్కు అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా కానీ ఉండదని చెబుతున్నారు నిర్మాత కేహెచ్ వేణు. అప్పి ప్రసాద్ దర్శకత్వంలో స్టేట్మెంట్ 8/11 తెరకెక్కింది.
ఎవరీ ఎంపీ రాజేంద్రన్...
ప్రధాని మోదీ పేరు చెప్పగానే.. తెల్లటి గడ్డం, కళ్లద్దాలు, లాల్చీ, పైజామా, కోటు గుర్తుకువస్తాయి. కానీ మోదీ టీ షర్ట్ వేసుకుని...బ్యాగ్ తగిలించకుని.. చేతిలో మొబైల్ పట్టుకుని రైల్వే స్టేషన్లో నిల్చొని ఉండటాన్ని మనం ఊహించగలమా.. అయితే గత జులైలో ఇది జరిగింది. కానీ అక్కడ నిల్చుని ఉన్నది మన ప్రధాని మోదీ కాదు. అచ్చం ఆయనలా ఉన్న మరో వ్యక్తి. ఆయన పేరు ఎంపీ రామచంద్రన్. ఓరోజు రైల్వే స్టేషన్లో నిల్చుని ఉన్నపుడు ఆయన ఫొటో తీసిన విద్యార్థి ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో పాపులర్ అయ్యార్. మోదీ ఇన్ పయ్యనూర్ స్టేషన్ అంటూ ఆ విద్యార్థి చేసిన కామెంట్.. విశ్రాంతి తీసుకోవాల్సిన వయస్సులో నటుడిగా కొత్త ప్రయాణానికి నాంది పలికిందంటున్నారు 64 ఏళ్ల రాజేంద్రన్.