
జన్మనిచ్చేది అమ్మ అయితే.. ప్రాణం పోసేది వైద్యుడు. కరోనా లాంటి ప్రాణాంతక రోగాలు వచ్చినప్పుడు వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి మన ప్రాణాలను కాపాడేందుకు శ్రమిస్తారు. నేడు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ జంట జెనీలియా, రితేశ్ దేశ్ముఖ్ ఓ ప్రతిజ్ఞ పూనారు. తమ అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో వీడియో షేర్ చేశారు. "రితేశ్, నేను ఈ పని ఎప్పుడో చేయాలని భావించాం, కానీ కుదరలేదు. ఈ రోజు డాక్టర్స్ డే సందర్భంగా మేము మా అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ సంకల్పానికి పూనుకునేందుకు మమ్మల్ని ప్రోత్సహించిన డా.నోజర్ శెరీర్, FOGSIకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. (ఇది శాశ్వతం.. మీ ప్రేమకు ధన్యవాదాలు!)
ఒకరికి జీవితాన్ని ఇవ్వడమే అసలైన బహుమతి. కాబట్టి మీరు కూడా ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు ఈ పనిలో భాగస్వాములు అవండి. అవయవదానం చేస్తామని ప్రతిజ్ఞ పూనండి" అని జెనీలియా పిలుపునిచ్చింది. వీరి నిర్ణయంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ వైద్యులు బిధాన్ చంద్రరాయ్ గుర్తుగా ప్రతి ఏటా జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటాం. ఆయన 1882 జూలై 1న జన్మించగా 1962 జూలై 1వ తేదీనే మరణించారు. ఆయన అందించిన విశేషమైన సేవలకు గానూ భారత ప్రభుత్వం 1964 ఫిబ్రవరి 4న బిధాన్ చంద్రరాయ్కు అత్యున్నత పురస్కారమైన భారత రత్నను బహుకరించింది. (విద్యుత్ జమాల్కు అండగా జెనీలియా!)
Comments
Please login to add a commentAdd a comment