
పరుచూరి వెంకటేశ్వరరావు, కృష్ణంరాజు, పరుచూరి గోపాల కృష్ణ
‘‘రచయితల సంఘం అంటే సరస్వతీ పుత్రుల సంఘం. అలాంటి సరస్వతీపుత్రుల సంఘం లక్ష్మీదేవి కటాక్షంతో అద్భుతమైన సొంత భవనం కట్టుకునేలా అభివృద్ధి చెందాలి’’ అని సీనియర్ నటుడు కృష్ణంరాజు అన్నారు. ఈ ఏడాది నవంబరు 3న రచయితల సంఘం రజతోత్సవ వేడుక జరగనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ని ఫిలిం నగర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో జరిగిన కరై్టన్ రైజర్ వేడుకకు సంబంధించిన టీజర్ను కృష్ణంరాజు ఆవిష్కరించారు.
1932 నుంచి ఇప్పటి వరకు తెలుగు చిత్రపరిశ్రమ అభివృద్ధి కోసం సినీ రచయితల కృషిని గుర్తు చేసుకున్నారు కొందరు అగ్ర రచయితలు. ఈ వేడుకలో కృష్ణంరాజు మాట్లాడుతూ – ‘‘‘లక్ష్మీ ఎదురుగా వస్తే నమస్కరించు. కానీ సరస్వతి ఎక్కడ ఉన్నా వెతికి వెతికి నమస్కరించు’ అని మా నాన్నగారు చెప్పారు. అందుకే ఈ వేడుకకు వచ్చాను. రచయితలకు ఏకాగ్రత, అంకితభావం ఉండాలి. కాలంతో పాటు రచయిత రచనల్లోనూ మార్పు వచ్చింది. ఆ రచనలు మంచి మర్గానికి దోహదపడాలి.
నేను పెద్ద పెద్ద మహానుభావులతో పని చేశాను. ఆత్రేయగారు ఏదైనా సీన్ రాసేప్పుడు ఆయన ఆ క్యారెక్టర్లోకి వెళ్లిపోయి డైలాగ్స్ రాసేవారు’’ అని అన్నారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సినిమా పుట్టుపూర్వోత్తరాల గురించి మాట్లాడారు. ఆ రోజుల్లో పద్యానికి దగ్గరగా పాట ఉండేదని అభిప్రాయపడ్డారు. రచయిత సముద్రాల రాఘవాచారి నుంచి చక్రపాణి వరకు సాగిన చరిత్రను గుర్తు చేశారు ఎస్.వి. రామారావు. పాతాళభైరవి, మిస్సమ్మ...వంటి నాటి ప్రముఖ సినిమాలు, దర్శకులు, రచయితల గురించి మాట్లాడారు నాగబాల సురేష్. 1
950 నుంచి 60వరకు వచ్చిన సినిమాల గురించి మాట్లాడారు. 1961–70 నాటి కాల సినిమాల గురించి ప్రస్తావించారు వడ్డేపల్లి కృష్ణమూర్తి. పాతతరం, కొత్తతరం రచయితలు కలిసి ముందుకు వెళ్లాల్సిన దశాబ్దం ఇదే అన్నారు చిలుకుమార్ నట్రాజ్. 1981–90 కాలంలో ఉన్న రచయితలు, దర్శకులు, సినిమాల గురించి మాట్లాడారు అనురాధ. ఈ కార్యక్రమంలో బలభద్రపాత్రుని రమణి, ప్రధాన కార్యదర్శి ఆకెళ్ల, పరుచూరి వెంకటేశ్వరరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.