
పుణే: మహారాష్ట్రలోని పుణే జిల్లాలో భారీ వర్షాల కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గల్లంతయ్యారు. వరదల్లో చిక్కుకున్న 16 వేల మందిని అధికారులు రక్షించారు. ముంబై–బెంగళూరు జాతీయ రహదారిపై ఖేద్–శివపూర్ గ్రామంలోని ఓ దర్గాలో నిద్రిస్తున్న ఐదుగురు వ్యక్తులు అకస్మాత్తుగా వచ్చిన వరదలకు కొట్టుకుపోయారు. అలాగే, అరణ్యేశ్వర్ ప్రాంతంలో గోడకూలిన ఘటనలో ఐదుగురు చనిపోయారు. మిగతా ప్రాంతాల్లో చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో మరో ఏడుగురు చనిపోయారు. పుణేతోపాటు బారామణి తహ్శీల్లో ప్రజలను రక్షించేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్)ను పంపించారు. గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.