
జిగిషా హత్య కేసులో దోషులు నిర్ధారణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో 2009లో సంచలనం సృష్టించిన జిగిషా ఘోష్ హత్య కేసులో ముగ్గురిని దోషులుగా ఖరారు చేస్తూ గురువారం ఢిల్లీ కోర్టు తీర్పు ఇచ్చింది. ఐటి ఉద్యోగిని జిగిషా ఘోష్ను అపహరించి, హత్య చేశారన్న ఆరోపణలపై అమిత్ శుక్లా, బల్జీ మాలిక్, రవి కపూర్లను దోషులుగా నిర్ధారిస్తూ అదనపు సెషన్స్ న్యాయమూర్తి సందీప్ యాదవ్ తీర్పు వెలువరించారు. వీరి శిక్షకు సంబంధించి ఆగస్టు 20వ తేదీన విచారణ జరుపుతామన్నారు.
అలాగే జ్యుడీషియల్ కస్టడీ సమయంలో దోషుల ప్రవర్తనపై నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు. 28 సంవత్సరాల జిగిషా ఘోష్ హెవిట్ అసోసియేట్ ప్రైవేట్ లిమిటెడ్లో ఆపరేషన్స్ మేనేజర్గా పనిచేసేది. 2009 మార్చి 18 వేకువజామున నాలుగు గంటలకు వసంత్ విహార్లోని తన ఇంటి వద్ద కంపెనీ క్యాబ్ నుంచి దిగిన జిగిషా తర్వాత కనిపించకుండా పోయింది.తర్వాత ఆమె వృతదేహం సూరజ్కుండ్లోని ఓ మురికి కాలువలో లభించింది.
దోషులను పట్టించిన ఆయుధం
దోషులుగా తేలిన ముగ్గురు వ్యక్తులు జిగిషాను అపహరించి హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత ఆమె క్రెడిట్ కార్డులోని డబ్బు కాజేశారని, నగల్ని, రిస్ట్ వాచ్లను, షూస్ను సరోజినీ నగర్ మార్కెట్లో అమ్ముకున్నట్లు వివరించారు. జిగిషాను హత్య చేయడానికి ఉపయోగించిన ఆయుధం పోలీసుల చేతికి చిక్కడంతో వారు ఈ కేసును ఛేదించగలిగారు.
ఈ ముగ్గురు దోషులు టీవీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో కూడా నిందితులు కావడం గమనార్హం. సౌమ్య 2008 సెప్టెంబర్ 30న హత్యకు గురైంది. ఆఫీసు నుంచి రాత్రి వేళ కారులో తిరిగి వస్తుండగా సౌమ్య హత్యకు గురైంది. జిగిషా కేసు దర్యాప్తులో నిందితులకు సౌమ్య విశ్వనాథన్ హత్యలోనూ హస్తముందని పోలీసులు గుర్తించారు.