
పినరయి విజయన్, బాబా రాందేవ్ (ఫైల్ ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కార్తకర్తలు, నేతలపై కేరళ సీఎం చేసిన ఆరోపణల్ని ఖండించారు. ఆరెస్సెస్కు చెందిన ఎంతో మందిని తాను దగ్గరి చూశానని, వారిలో ఉగ్రవాదులు ఎవరూ లేరని రాందేవ్ బాబా పేర్కొన్నారు.
ఆరెస్సెస్ నాయకులు, కార్తకర్తలు ఎంతో మంది తనకు తెలుసునని, కానీ వారిలో ఏ ఒక్కరూ ఉగ్రవాదులు గానీ, నక్సలైట్స్ వర్గాలకు చెందిన వాళ్లు లేరని జాతీయ మీడియా ఏఎన్ఐతో మాట్లాడుతూ తెలిపారు. దేశానికి చెందిన ఓ జాతీయ గ్రూపు లాంటిది ఆరెస్సెస్ అని చెప్పారు. దేశానికి హాని కలిగించే పనులు వారు చేయరంటూ పినరయి విజయన్ వ్యాఖ్యలను యోగా గురువు తిప్పికొట్టారు.
అసలు వివాదం ఏంటంటే..
'పీఎఫ్ఐ, ఆరెస్సెస్ గ్రూపులు ఆయుధాల వాడకంపై శిక్షణ ఇస్తున్నాయి. చట్ట వ్యతిరేకంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని దేవాలయాల్లోనూ కర్రలతో దాడి చేయడంపై యువకులకు శిక్షణ ఇస్తున్నారు. అవసరమైతే కొత్త చట్టాలను తీసుకొచ్చి ఆరెస్సెస్ చర్యలను నిషేధించాలంటూ' కేరళ సీఎం పినరయి విజయన్ అసెంబ్లీలో బుధవారం వ్యాఖ్యానించడం దూమారం రేపిన విషయం తెలిసిందే.