
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానా తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆస్ధానాతో పాటు సీబీఐ డిప్యూటీ సూపరింటెండెంట్ దేవేందర్ కుమార్, దళారి మనోజ్ ప్రసాద్లపై దాఖలైన కేసును కొట్టివేసేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. నేర విచారణలపై ఆస్ధానాకు కల్పించిన మధ్యంతర ఊరటను తొలగించారు.
ఆస్ధానా సహా ఇతరులపై నమోదైన కేసు విచారణను పది వారాల్లోగా పూర్తిచేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ఆస్ధానాకు వ్యతిరేకంగా దాఖలు చేసిన నేరపూరిత కుట్ర, అవినీతి, నేర ప్రవర్తన అభియోగాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, మాంసం ఎగుమతిదారు మొయిన్ ఖురేషీ ప్రమేయంతో కూడిన మనీల్యాండరింగ్ కేసు నుంచి తనను తప్పించేందుకు తాను ముడుపులు ముట్టచెప్పానని హైదరాబాద్కు చెందిన సాన సతీష్ బాబు ఫిర్యాదు ఆధారంగా ఆస్ధానా తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
మరోవైపు సీబీఐ చీఫ్ ఆలోక్ వర్మపై ఆరోపణలు చేసినందుకే తనపై ముడుపుల కేసును ముందుకు తెచ్చారని, తనపై అభియోగాలకు ఎలాంటి ఆధారాలు లేవని రాకేష్ ఆస్ధానా కోర్టుకు నివేదించారు. ఇక ఫైర్ సర్వీసుల డీజీ బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించిన ఆలోక్ వర్మ ప్రభుత్వ సర్వీసు నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment