ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపణ
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని మోదీపై సంచలన ఆరోపణ చేశారు. ప్రధాని తనను చంపిస్తారేమోనని అన్నారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అసాధారణ అణచివేతలను ఎదుర్కొనేందుకు ఆప్ ఎమ్మెల్యేలు త్యాగాలకు సిద్ధంగా ఉండాలన్నారు. ఏడాదిన్నర కాలంలో ఆప్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడుల్ని ప్రస్తావిస్తూ పార్టీ కార్యకర్తలకు వీడియో సందేశమిచ్చారు. దాడుల సూత్రధారి మోదీనేనన్నారు. ‘ఆప్ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు ఇది సంక్లిష్ట సమయం. రానున్న రోజుల్లో ఇది మరింత దారుణంగా ఉండొచ్చు. ఆయన (మోదీ) మనల్ని చంపించేదాకా వెళ్లొచ్చు.
నన్నూ చంపించవచ్చు. ఎమ్మెల్యేలందరినీ జైలుకు పంపొచ్చు. మీ కుటుంబాలతో మాట్లాడి ఎలాంటి త్యాగాలు చేసేందుకైనా సిద్ధంగా ఉండండి. ఈ కష్టాలను ఎదుర్కొనేందుకు సిద్ధపడితే మాతో ఉండండి. లేకపోతే మమ్మల్ని వదిలిపెట్టండి’ అని చెప్పారు. ఇప్పటిదాకా 11 మంది ఆప్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం తెలిసిందే. ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వర్ ఇంటిపై ఆదాయ పన్ను అధికారులు బుధవారం సోదా చేశారు. కాగా, ఆప్ నేతలు నేరాలకు పాల్పడకుండా అరికట్టడంలో విఫలమై.. ప్రధానిపై సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని కేజ్రీని బీజేపీ విమర్శించింది.
మోదీ నన్ను చంపిస్తారేమో!
Published Thu, Jul 28 2016 2:27 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM
Advertisement