
SY Quraishi
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు మహిళలకే ఎక్కువగా ఉంటాయని ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి ఎస్వై ఖురేషీ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.
‘మహిళలు ఓడిపోతారనే భావన సరైంది కాదు. గత 70 ఏళ్లుగా జరిగిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే మహిళలకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారికిచ్చే టికెట్ల శాతం(6%) కంటే వారి గెలుపు శాతమే(10%) ఎక్కువగా ఉంది. ఈ గణాంకాలు చాలు.. వారు ఎన్నికల్లో గెలవలేరనే భావన తప్పని నిరూపించడానికి’ అని ఖురేషీ తెలిపారు.
ఇక మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి ఆయన ప్రస్తావించారు. భారత్లో 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న 28 శాతం మంది మహిళలు లైంగిక వేధింపుల గురౌతున్నారన్నారు. మహిళలు హింసను భరించాలే తప్ప ఎదురు తిరగకూడదని పురుషులు భావించడం దారుణమని ఆయన పేర్కొన్నారు. మహిళల సంక్షేమం కోసం మన రాజ్యాంగం ఎన్నో హక్కులను, చట్ట సభలు చట్టాలను కల్పించాయని.. కానీ, అవేవీ అమలు కాకపోవటం బాధాకరమైన విషయమని ఖురేషీ ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment