‘కరోనా’ పై కొత్త చాలెంజ్‌.. భారీ స్పందన | Health Minister Dr Harsh Vardhan Take Safe Hands Challenge Over Coronavirus | Sakshi
Sakshi News home page

‘కరోనా’ పై కొత్త చాలెంజ్‌.. భారీ స్పందన

Published Wed, Mar 18 2020 3:51 PM | Last Updated on Wed, Mar 18 2020 4:28 PM

Health Minister Dr Harsh Vardhan Take Safe Hands Challenge Over Coronavirus - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సోషల్‌ మీడియాలో ఇప్పటి వరకు రకరకాల చాలెంజ్‌లను చూశాం. ఐస్‌ బకెట్‌ చాలెంజ్‌, ఫిట్‌నెస్‌, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌.. ఇలా పలు రకాల చాలెంజ్‌లను సోషల్‌ మీడియా ద్వారా ప్రముఖులు ఇతరులకు విసిరారు. వారంతా ఆ చాలెంజ్‌ని స్వీకరించి మరికొంత మందికి సవాల్‌ విసిరారు.  ఇప్పుడు మరో కొత్త ఛాలెంజ్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)  ప్రారంభించింది. కరోనావైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్నవేళ.. దానిని అడ్డుకునేందుకు డబ్ల్యూహెచ్‌ఓ ‘ సేఫ్ హ్యాండ్స్ (#SafeHands) ’ చాలెంజ్‌ను తెరమీదకు తెచ్చింది.

ఈ నెల 13 న డబ్య్లూహెచ్‌ఓ డైరెక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయెసస్ ‘సేఫ్ హ్యాండ్స్’ అనే సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించారు. ట్విటర్ లో తన చేతులు శుభ్రపరుచుకుంటున్న వీడియోని షేర్ చేశారు. చేతులను సబ్బుతో కానీ, ఆల్కహాల్ తో గానీ శుభ్రం చేసుకోవాలని చెబుతూ.. మొత్తం 11 స్టెప్స్ ఫాలో అవ్వాలని వీడియోలో చూపారు.  తన ఫాలోవర్స్ తో పాటుగా కొందరి ప్రముఖులను(క్రీడాకారులు, సినీ నటులు) కూడా ఇలాగే తమ వీడియోలను తీసి షేర్ చేయాలని ఛాలెంజ్ చేశారు.
(చదవండి : కోహ్లి, సానియాకు చాలెంజ్‌ విసిరిన సింధు)
 

డబ్ల్యూహెచ్‌ఓ విసిరిన చాలెంజ్‌కు భారత్‌లో మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే ఈ చాలెంజ్‌ను పలువురు క్రీడాకారులు, సినీనటులు స్వీకరించారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు, బాలీవుడ్ హీరోయిన్లు దీపికా ప‌దుకొణే, అనుష్క శర్మ తదితరులు 'సేఫ్‌ హ్యాండ్స్‌' చాలెంజ్‌ను స్వీకరించి  చేతులను సబ్బుతో శుభ్రం చేసుకొని, ఆ  వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. తాజాగా భారత ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ కూడా ‘సేఫ్‌ హ్యాండ్స్‌’ చాలెంజ్‌ను స్వీకరించారు. చేతులను సబ్బుతో శుభ్రం చేసుకొని, ఆ వీడియోను ట్వీటర్‌లో పోస్ట్‌ చేశారు. పౌరులంతా ‘  సేఫ్‌ హ్యాండ్స్‌’ చాలెంజ్‌ను స్వీకరించాలని కోరారు. ప్రతి ఒక్కరు తమ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకొని కరోనావైరస్‌ను హతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక తన ‘సేఫ్‌ హ్యాండ్స్’   చాలెంజ్‌ను పార్లమెంబ్‌ సభ్యులందరికి విసిరారు. ఎంపీలంతా చేతును శుభ్రం చేసుకొని, ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాలని కోరారు.
(కరోనా  : ఫేస్‌బుక్ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ )
 

కాగా, కరోనా కేసులు ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ రెండు లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవగా, దాదాపు 8000 మంది మరణించారు. పాకిస్తాన్‌లో 212 కేసులు నమోదు కాగా బుధవారం తొలి మరణం నమోదైంది. వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న ఇరాన్‌లో కరోనా కేసుల సంఖ్య 988కి పెరగ్గా 135 మంది మరణించారు. స్సెయిన్‌లో తాజాగా 2000 కొత్త కేసులు నమోదవగా మొత్తం పాజిటివ్‌ కేసుట సంఖ్య ఏకంగా 11,000కు ఎగబాకింది. ఇక భారత్‌లో 147 కరోనా పాజిటీవ్‌ కేసులు నమోదవగా, ముగ్గురు మరణించారు. తెలంగాణ ఆరుగురికి కరోనావైరస్‌ సోకింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక కేసు నమోదైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement