
'2006లో ముంబైలో ఆఫీసు పెట్టా'
ముంబై: 26/11 ముంబై దాడుల కేసులో అప్రూవర్గా మారిన డేవిడ్ కోల్మన్ హెడ్లీ(55) సంచలన విషయాలు వెల్లడిస్తున్నాడు. నాలుగో రోజు గురువారం ముంబై ప్రత్యేక కోర్టు జడ్జికి వీడియో లింక్ ద్వారా హెడ్లీ వాంగ్మూలం ఇచ్చాడు. ముంబైపై ముష్కరుల దాడికి అండదండలు అందించింది పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐనేనని ఇప్పటికే వెల్లడించిన హెడ్లీ మరిన్ని విషయాలు బయటపెట్టాడు.
ఐఎస్ఐ అధికారి మేజర్ ఇక్బాల్, సామిర్ అలీ, డాక్టర్ తవ్వూర్ రానా, అబ్దుర్ రెహ్మాన్ పాషా నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నానని వెల్లడించాడు. ముంబైలోని నారీమన్ ప్రాంతంలో ఉన్న ఇండస్ ఇండ్ బ్యాంకు ద్వారా ఈ మొత్తం అందుకున్నానని తెలిపాడు. 2006, సెప్టెంబర్ 14న టార్డియో ఏసీ మార్కెట్ ప్రాంతంలో కార్యాలయం ప్రారంభించానని చెప్పాడు. 26/11 దాడుల తర్వాత దీన్ని మూసివేయాలని భావించినట్టు పేర్కొన్నాడు.
భారత్ లో తాను రెండుమూడు ఫోన్ నంబర్లు వినియోగించినట్టు తెలిపాడు. ఇక్బాల్, సామిర్ అలీ, రానాలతో ఇ-మెయిల్స్ ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినట్టు పంపినట్టు తెలిపాడు. 2004లో గుజరాత్ ఎన్ కౌంటర్ లో హతమైన ఇష్రత్ జహాన్ తీవ్రవాద సంస్థ లష్కర్ తోయిబా సభ్యుడని వెల్లడించాడు. లష్కర్ తోయిబాలో మహిళా విభాగం కూడా ఉందని చెప్పాడు.