
అగ్ని-3 అణ్వస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం
అణ్వస్త్ర సామర్థ్యంగల అగ్ని-3 బాలిస్టిక్ క్షిపణిని గురువారం భారత్ మూడోసారి విజయవంతంగా పరీక్షించింది.
బాలాసోర్: అణ్వస్త్ర సామర్థ్యంగల అగ్ని-3 బాలిస్టిక్ క్షిపణిని గురువారం భారత్ మూడోసారి విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని వీలర్ ఐలాండ్ నుంచి డీఆర్డీఓ నేతృత్వంలో సైన్యం ఈ పరీక్షను పూర్తిచేసింది. ఉపరితలం నుంచి ఉపరితలంపై 3000 కి.మీ. దూరంలోపు లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణిని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్నుంచి ఉదయం 09.55 గంటలకు పరీక్షించినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.
అగ్ని-3లో రెండంచెల ఘన ఇంధన వ్యవస్థ ఉంటుంది. 17 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వ్యాసం, 50 టన్నుల బరువు ఉండే ఈ క్షిపణి 1.5 టన్నుల న్యూక్లియర్ వార్హెడ్ను మోసుకుపోతుంది. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఈ క్షిపణి ఇప్పటికే సైన్యం అమ్ములపొదిలోకి చేరింది.