
సాక్షి, న్యూఢిల్లీ : జలప్రళయంలో అతలాకుతలమైన కేరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటించిన 700 కోట్ల రూపాయల సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం సమంజసమేనా ? కాదా? అయితే ఏ మేరకు సమంజసం ? కాకుంటే ఎందుకు కాదు ? ఆపద సమయాల్లో వచ్చే విదేశీ ఆర్థిక సహాయాన్ని తిరస్కరించడమనే సంప్రదాయం ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. 2004 సంవత్సరంలో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది.
2004లో తమిళనాడు, అండమాన్, నికోబర్ దీవుల్లో సునామీ వచ్చినప్పుడు, 2005లో కశ్మీర్లో భూకంపం వచ్చినప్పుడు, 2013లో ఉత్తరాఖండ్లో వరదలు, 2014లో కశ్మీర్లో వరదలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం విదేశీ ఆర్థిక సహాయాన్ని వరుసగా తిరస్కరిస్తూ వస్తోంది. ఇందుకు కారణం అవి బేషరతు విరాళాలు కాకపోవడమే. తాము ఇస్తున్న ఆర్థిక సహాయంలో ఫలాన సామాజిక వర్గానికే ఎక్కువ ఖర్చు పెట్టాలని, ఫలానా అభివద్ధి కార్యక్రమాలకే ఖర్చు చేయాలని లేదా తాము అందిస్తున్న ఆర్థిక సహాయానికి ప్రతిఫలంగా వీసా నిబంధనల్లో తమ దేశానికి వెసులుబాటు కల్పించాలని, వాణిజ్య ఆంక్షలను లేదా తమ ఉత్పత్తుల దిగుమతులపై పన్నులను సడలించాలనో షరతులు ఉంటాయి.
ఆశ్చర్యంగా ఈసారే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎలాంటి షరతులు లేకుండా ఏకంగా 700 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. మన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేరళకు ప్రకటించిన ఆర్థిక సహాయంకన్నా అది 15 శాతం ఎక్కువ. ఎమిరేట్స్ కార్మిక వర్గంలో ఎక్కువ మంది కేరళ వాసులే అవడం వల్ల ఆ దేశం ఇంతపెద్ద మొత్తంలో ఆర్థిక సహాయాన్ని ప్రకటించి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బేషరుతుగా వచ్చిన ఈ ఆర్థిక సహాయాన్ని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తిరస్కరించిందంటే దేశ ప్రతిష్టను నిలబెట్టుకోవడం కోసమే కావచ్చు. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా భారత్ ఎంతో పురోభివద్ధి సాధిస్తోందని చెప్పుకుంటున్న తరుణంలో విదేశీ వితరణను స్వీకరించడం బలహీనత అవుతుండొచ్చు.
వాస్తవానికి గతంలో వచ్చిన సునామీ, వరదలు, భూకంపాలకన్నా ఇప్పుడు కేరళను ముంచెత్తిన జల ప్రళయం ఎక్కువ తీవ్రమైనది. కేరళలో కొన్ని వందల మంది మరణించడమే కాకుండా పది లక్షల మంది ప్రజలు నిరాశ్రీయులయ్యారని, 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయల నష్టం వాటిళ్లి ఉండవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘ఇలాంటి సమయాల్లో ఏ ప్రతిఫలం ఆశించకుండా బేషరతుగా సౌహార్దపూర్వకంగా వచ్చే విదేశీ ఆర్థిక సహాయాన్ని భారత ప్రభుత్వం స్వీకరించవచ్చు’ అని ‘నేషనల్ డిస్సాస్టర్ మేనేజ్ఎంట్ ప్లాన్’ సూచిస్తోంది. కేరళ ఆర్థిక శాఖ మంత్రి థామస్ ఇస్సాక్ కూడా కేంద్రం దష్టికి ఇదే విషయాన్ని తీసుకొచ్చారు. ఎమిరేట్స్ ఇచ్చినంత ఆర్థిక సహాయాన్ని అందించాల్సిందిగా మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక్కడ నిజంగా దేశ ప్రతిష్టను నిలబెట్టుకోవాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటే ఎమిరేట్స్ కన్నా ఎక్కువ ఆర్థిక సహాయాన్ని స్వయంగా కేరళకు ప్రకటించాలి. కేరళ పునర్నిర్మాణంలో క్రియాశీలక పాత్ర వహించాలి.
Comments
Please login to add a commentAdd a comment