
న్యూఢిల్లీ: ఏ న్యాయమూర్తి తాను తప్పు తీర్పు ఇచ్చానని ఒప్పుకోరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సరైన ఆధారాలు లేకుండా, కేవలం తప్పుడు ఆదేశాలు ఇచ్చారన్న కారణంతో జడ్జీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేమంది. ‘న్యాయవ్యవస్థ స్వతంత్రత పవిత్రమైంది.తప్పు చేసినట్లు, అవినీతికి పాల్పడినట్లు, ప్రలోభాలకు గురైనట్లు స్పష్టమైన ఆరోపణలుంటే తప్ప.. తప్పు తీర్పు ఇచ్చారన్న ఒకే కారణంతో క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించరాదు’ అని జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్ల ధర్మాసనం వ్యాఖ్యానించింది.
తనపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించడంపై బిహార్కు చెందిన ఒక న్యాయాధికారి దాఖలు చేసి పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అప్పటికే హైకోర్టు బెయిల్ను నిరాకరించిన విషయాన్ని గుర్తించకుండా.. హత్యారోపణలు ఎదుర్కొంటున్న కొందరికి బెయిల్ మంజూరు చేయడంపై, మరో డ్రగ్ సంబంధిత కేసు విచారణను హడావుడిగా ముగించడంపై ఆ న్యాయాధికారిపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అది హిందూ నిర్మాణమే! : అయోధ్య వివాదాస్పద స్థలంలో పురాతత్వ శాఖ(ఏఎస్ఐ) జరిపిన తవ్వకాల్లో వెల్లడైన విషయాలు ఆ స్థలం తమదేనన్న ముస్లింల వాదనను స్పష్టంగా తోసిపుచ్చుతున్నాయని రామ్ లల్లా తరఫు న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ సుప్రీంకోర్టుకు విన్నవించారు. అయోధ్య వివాదాస్పద స్థల యాజమాన్య వ్యాజ్యంపై జస్టిస్ రంజన్ గొగోయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు గురువారం వాదనలు కొనసాగాయి.
Comments
Please login to add a commentAdd a comment