
న్యూఢిల్లీ: తాజ్మహల్లోని మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేసేందుకు స్థానిక ముస్లింలను తప్ప ఇతర ప్రాంతాల వారిని అనుమతించొద్దని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒక్కటైన తాజ్ ఉనికికి ప్రమాదం వాటిళ్లకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇతర ప్రాంతాల వారు ఆగ్రాలో ప్రార్థనలు చేసుకోవడానికి వేరే మసీదులు ఎన్నో ఉన్నాయని జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. భద్రత కారణాల దృష్ట్యా తాజ్ పరిధిలో ప్రార్థనలకు స్థానికేతరులను అనుమతించొద్దంటూ ఆగ్రా జిల్లా అదనపు మెజిస్ట్రేట్ జనవరి 24న ఆదేశాలిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. మెజిస్ట్రేట్ ఆదేశాలనే సుప్రీంకోర్టు సమర్థించింది.