
బీజేపీ, ఆరెస్సెస్ రిజర్వేషన్లకు వ్యతిరేకమని, వారు దళితుల పురోగతిని కోరుకోరని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ, ఆరెస్సెస్లు రిజర్వేషన్లకు వ్యతిరేకమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దళితుల పురోగతిని వారు కోరుకోరని, బీజేపీ, ఆరెస్సెస్లు వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్ట సవరణలను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లను తొలగించాలనేది ఆరెస్సెస్, బీజేపీ డీఎన్ఏలో భాగమని, రిజర్వేషన్లు ఎట్టిపరిస్థితుల్లో కొనసాగేలా చూస్తామని తాను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దళితులకు హామీ ఇస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు.
రిజర్వేషన్లను తొలగించడం మోదీజీ, మోహన్ భగవత్ల స్వప్నాన్ని తాము నెరవేరనీయబోమని వివరించారు. కాగా ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక సవరణ చట్టం రాజ్యాంగ భద్రతను సుప్రీంకోర్టు సమర్ధించింది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. ఈ చట్టం కింద ప్రాథమిక ఆధారాలు లభ్యం కాని కేసుల్లోనే కోర్టులు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, ఎఫ్ఐఆర్ నమోదుకు ప్రాధమిక దర్యాప్తు అవసరం లేదని, సీనియర్ పోలీస్ అధికారి అనుమతి అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.