
శబరిమల అయ్యప్ప ఆలయాన్ని తెరవనుండటంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తిరువనంతపురం: మలయాళ నెల కుంభం సందర్భంగా ఈనెల 12 నుంచి 17 వరకు శబరిమల అయ్యప్ప ఆలయాన్ని తెరవనుండటంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు కేరళ ప్రభుత్వం పట్టుదలతో ఉండటం, సంప్రదాయ విరుద్ధంగా ఆలయంలోకి వచ్చే రుతుస్రావం వయస్సు మహిళలను అడ్డుకునేందుకు హిందూ సంస్థలు ప్రయత్నించడంతో మండల పూజల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే.
మంగళవారం నుంచి ఆలయంలోకి భక్తులను దర్శనానికి అనుమతించనుండటంతో పోలీసుల ఆంక్షలు, హిందూ సంస్థల నిరసనల ఎలాంటి పరిణామాలకు దారితీయనుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంగళవారం సాయంత్రం ముఖ్య పూజారి వాసుదేవన్ నంబూద్రి సమక్షంలో ప్రధాన ఆలయ ద్వారాలను తెరిచి పూజలు ప్రారంభిస్తారు. శబరిమల ఆలయం పరిరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నలుగురు మించి గుమికూడరాదని ఆదేశాలు జారీచేశారు.