
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో జాగ్రత్తగా వ్యవహరించాలని బీజేపీ నాయకత్వానికి ఆ పార్టీ ఎంపీ శత్రుఘ్న సిన్హా సూచించారు. ప్రభుత్వాన్ని, పార్టీని తన వ్యాఖ్యలతో తరచూ ఇరకాటంలోకి నెట్టే సిన్హా మమతా వర్సెస్ సీబీఐ వ్యవహరంలోనూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. కోల్కతా పోలీస్ కమిషనర్ నివాసంపై సీబీఐ దాడుల నేపథ్యంలో మమతా సర్కార్, కేంద్ర ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.
మమతా బెనర్జీ ఐరన్ లేడీ అని ఆమెను జాగ్రత్తగా హ్యాండిల్ చేయకుంటే ప్రమాదమని పార్టీని హెచ్చరించారు. ఏమైనా సమయం మించిపోతుంది జాగ్రత్త అంటూ సిన్హా నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తూ ట్వీట్ చేశారు. శత్రుఘ్న సిన్హా గతంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. నోట్ల రద్దు, జీఎస్టీ సహా మోదీ సర్కార్ చేపట్టిన పలు విధాన నిర్ణయాలతో ఆయన పలుమార్లు విభేదించారు.