
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ (ఫైల్ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై మరికొందరు న్యాయమూర్తులతో కలిసి బాహాటంగా తిరగుబాటు చేసిన సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ శుక్రవారం పదవీవిరమణ చేయనున్నారు. ఏడేళ్ల పాటు సర్వోన్నత న్యాయస్ధానంలో జస్టిస్ చలమేశ్వర్ విధులు నిర్వహించారు. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ బీహెచ్ లోయా మృతి కేసు సహా కీలక కేసుల కేటాయింపుపై న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గగోయ్, మదన్ బీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్లతో కలిసి ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 12న సర్వోన్నత న్యాయస్ధానం పనితీరుపై జాస్తి నేతృత్వంలో న్యాయమూర్తులు బాహాటంగా వెల్లడించిన అంశాలు న్యాయవ్యవస్థతో పాటు దేశవ్యాప్తంగా పెనుప్రకంపనలు సృష్టించాయి.
సుప్రీంకోర్టులో సమానత్వాన్ని కాపాడలేకుంటే దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని, స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయవ్యవస్ధే ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆలంబన అవుతుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారంతో 65వ ఏట అడుగుపెడుతున్న చలమేశ్వర్ గోప్యత హక్కు ప్రాధమిక హక్కు అని చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్లో సభ్యులు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment