
సాక్షి, విశాఖపట్నం : సిట్( ప్రత్యేక దర్యాప్తు బృందం) బృందంపై తనకు నమ్మకం లేదని, సిట్ అనే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొత్తులుగా మారిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్ చేసినా, లేక కలిసి పరామర్శించి.. హుందాగా వ్యవహరించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కానీ అధికార పార్టీ నాయకులు కోడి కత్తి అని అవహేళన చేయటం విడ్డూరమన్నారు.
వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నం ఘటనలో ఎయిర్పోర్టు సిబ్బంది అత్యుత్సాహం చూపించారని మండిపడ్డారు. హత్యాయత్నం జరిగిన కొన్ని గంటలకే డీజీపీ రాజకీయ నాయకుల మాదిరిగా వ్యవహరించి విలేకరుల సమావేశం పెట్టడం హాస్యాస్పదమన్నారు. డిసెంబర్ 11 తరువాత కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోయి, ఫార్మ్హౌస్లో క్యాప్సికం అమ్ముకుంటాడని ఎద్దేవా చేశారు.