
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించకపోవడాన్ని నిరసిస్తూ ఎంపీ పదవులకు తాము చేసిన రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 29న లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ను కలిసి, రాజీనామాలను ఆమోదింపజేసుకుంటామని చెప్పారు. రాజీనామాలను ఆమోదించక తప్పని పరిస్థితిని కల్పిస్తామని అన్నారు. మేకపాటి రాజమోహన్రెడ్డి శనివారం హైదరాబాద్లో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నాలుగేళ్లు బీజేపీతో అంట కాగి ఇప్పుడు యూటర్న్ తీసుకున్న సీఎం చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలినుంచీ పోరాడుతున్నారని మేకపాటి గుర్తుచేశారు. చంద్రబాబు కోరికలను నరేంద్ర మోదీ తీర్చకపోవడంతో, బెంగళూరుకు వెళ్లి కొత్త స్నేహితులను వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా సాధనతో సహా విభజన చట్టంలోని హామీలను నెరవేర్చే సత్తా వైఎస్సార్సీపీకి మాత్రమే ఉందన్నారు.