
జనసేన అధ్యక్షడు పవన్ కల్యాణ్
ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు
సాక్షి, పశ్చిమగోదావరి : ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు వల్లే అరకు ఎమ్మెల్యే హత్య జరిగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. అరకు పాంత్రంలో అక్రమ మైనింగ్పై ప్రజలు చేసిన ఫిర్యాదులను సీఎం పట్టించుకోకపోవడం వల్లే మావోయిస్టులు ఎమ్మెల్యేను హత్య చేశారన్నారు. బుధవారం ఆయన దెందులూరు బహిరంగ సభలో మాట్లాడుతూ.. రౌడీలు చట్టసభలకు వచ్చి పిచ్చివాగుడు వాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీయిజం చేస్తూ రాజకీయం చేస్తామంటే ఖబర్దార్ అని ఎల్యే చింతమనేని ప్రభాకర్ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ విప్ పదవిలో ఉండి దౌర్జన్యం చేస్తుంటే సీఎం ఎం చేస్తున్నారని ప్రశ్నించారు. 27 కేసులున్న దెందులూరు ఎమ్మెల్యేను చట్టసభల్లో కూర్చోబెట్టారని విమర్శించారు. కొల్లేరు భూముల్లో అక్రమంగా చెరువులు తవ్వుకుంటూ అడ్డువచ్చిన వారిపై దాడులు చేయడం మానుకోవాలని పవన్ హెచ్చరించారు. చింతమనేని ఇన్ని దారుణాలు చేస్తుంటే జిల్లా కలెక్టర్, డీజీపీ, హోంమినిస్టర్, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని మండిపడ్డారు.
చట్టసభల్లోకి వెళ్లకుండా జైల్లో కూర్చోవాల్సిన వారిని పెంచి పోషిస్తున్న టీడీపీకి తాను ఎందుకు మద్దతు ఇవ్వాలని ప్రశ్నించారు. చంద్రబాబుకి, లోకేశ్కి చింతమనేని అంటే భయం అందుకే అతనిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. చింతమనేని నీ అరాచకాలు మానుకోకపోతే నేనే దెందులూరు వస్తాను ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ప్రశాంతమైన పశ్చిమగోదావరిలో ప్రశాంతత లేకుండా చేశారని మండిపడ్డారు. జనసేన కార్యకర్తలపై వేధింపులు ఆపకపోతే తిరగబడతామని, చర్యకు ప్రతి చర్య ఉంటుందని చింతమనేనికి పవన్ వార్నింగ్ ఇచ్చారు.