
కంటోన్మెంట్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వెళుతున్న శ్రీగణేష్
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఒక్క ముషీరాబాద్ మినహా అన్ని స్థానాలకు పోటీ చేసే వారి పేర్లను టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది. బుధవారం రాత్రి ఆరుగురితో కూడిన జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. ప్రజాకూటమిలోనూ అభ్యర్థిత్వాల ఎంపిక చివరి దశకు చేరింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు, టీడీపీ నుంచి ఇద్దరి పేర్లు ఖరారయ్యాయి. ఎల్బీనగర్ టికెట్ను కాంగ్రెస్ నుంచి సుధీర్రెడ్డి, టీడీపీ నుంచి సామ రంగారెడ్డి ఆశించగా, సామ రంగారెడ్డికి ఇబ్రహీంపట్నం సీటు టీడీపీ ఖరారు చేయడంతో సుధీర్రెడ్డికి లైన్ క్లియర్ అయినట్టేనని కాంగ్రెస్వర్గాలు భావిస్తున్నాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా మల్కాజిగిరి, అంబర్పేట స్థానాలు టీజేఎస్కు వెళ్లే అవకాశాలున్నాయి. ఇప్పటికే మల్కాజిగిరి నుంచి టీజేఎస్ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. సనత్నగర్, సికింద్రాబాద్ సెగ్మెంట్లపై టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నడుమ ఇంకా పీటముడి వీడలేదు. కూకట్పల్లి టికెట్ దాదాపు టీడీపీకే కేటాయించే అవకాశాలున్నాయి. ఇంకా అక్కడ అభ్యర్థి ఫైనల్ కాలేదు. టీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గానికి దానం నాగేందర్, గోషామహల్కు ప్రేమ్సింగ్ రాథోడ్, చార్మినార్కు మహమ్మద్ సలావుద్దీన్ లోడి, అంబర్పేట నియోజకవర్గానికి కాలేరు వెంకటేష్, మల్కాజిగిరికి ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, మేడ్చల్కు ఎంపీ సీహెచ్. మల్లారెడ్డి అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది.
ముషీరాబాద్కు ముఠా గోపాల్?
ఈ నియోజకవర్గానికి అధికారికంగా టీఆర్ఎస్ ఎవరినీ ప్రకటించకున్నా ముఠా గోపాల్ అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి మంత్రి నాయిని నర్సింహారెడ్డి టికెట్ కోసం పట్టుబడుతున్న విషయం విదితమే. తనకు కానీ, తన అల్లుడు, కార్పొరేటర్ శ్రీనివాస్రెడ్డికి గానీ టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే, నాయినికి సర్దిచెప్పి గోపాల్ అభ్యర్థిత్వం ఖరారు చేయాలన్న యోచనలో టీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అంశంపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించి ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయంతీసుకుంటామని కేసీఆర్ ప్రకటించారు.
కూటమిలో ఇలా...
నగరంలో మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ.. మరో రెండు స్థానాల కోసం కొనసాగుతున్న పేచీలపై కూడికలు, తీసివేతలతో ఏం చేయాలన్నదానిపై కసరత్తు చేస్తోంది. బుధవారం ప్రకటించిన జాబితాలో మేడ్చల్కు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, జూబ్లీహిల్స్కు విష్ణువర్ధన్రెడ్డి, ఖైరతాబాద్కు దాసోజు శ్రవణ్లను ప్రకటించిన ఏఐసీసీ.. సికింద్రాబాద్, సనత్నగర్ స్థానాలపై చర్చలు కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్లో టీడీపీ నేత గణేష్గుప్తాను అధికారికంగా ప్రకటించడంతో ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి ఆశలు ఆవిరయ్యాయి. ఇక టీడీపీకి సికింద్రాబాద్–సనత్నగర్లో ఏదో ఒక స్థానాన్ని కేటాయిస్తే సరిపోతుందన్న భావనలో కాంగ్రెస్ ఉంది. సనత్నగర్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్రెడ్డి బరిలో ఉండగా, ఈ సీటు తమకు కావాలని టీడీపీ పట్టుపడుతోంది. దీంతో పరిష్కారం జఠిలంగా మారింది. మేడ్చల్లో మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి – టీడీపీ నుంచి పార్టీలో చేరిన తోటకూర జంగయ్య యాదవ్ టికెట్ కోసం హోరాహోరీగా పోటీపడ్డారు. అయితే, పలు సమీకరణల అనంతరం జంగయ్యకు మరో ప్రత్యామ్నాయ పదవి ఇవ్వాలని నిర్ణయించి లక్ష్మారెడ్డినే ఫైనల్గా బరిలోకి దింపారు. జూబ్లీహిల్స్ స్థానాన్ని టీడీపీ బలంగా కోరినా అక్కడికి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డినే అధిష్టానం ఖరారు చేసింది. ఇక ఖైరతాబాద్కు పలువురు పార్టీ నాయకులు పోటీ పడ్డా అనూహ్యంగా దాసోజు శ్రవణ్ను ప్రకటించారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన శ్రవణ్.. టీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేయడంతో పాటు పలు కార్యక్రమాలతో ఏఐసీసీ నేతల మెప్పును సైతం పొందారు.
హైదరాబాద్లో 30 మంది నామినేషన్లు
జిల్లా నుంచి బుధవారం 30 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో కొందరు రెండు, మూడు, నాలుగు సెట్ల నామినేషన్లు వేశారు. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అనిల్కుమార్ యాదవ్ మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మలక్పేట టీఆర్ఎస్ అభ్యర్థి సి.సతీష్కుమార్, అంబర్పేట నియోజకవర్గంలో టీడీపీ తరఫున వనం రమేశ్, పిరిమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా వీకే ఉపేంద్ర, ఇండిపెండెంట్గా పొన్నపాటి చిన్నలింగయ్య, ఖైరతాబాద్లో బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి నాలుగు సెట్ల నామినేషన్లు వేశారు. ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బీఎన్ రెడ్డి, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా(కమ్యూనిస్ట్) అభ్యర్థిగా ఈ.హేమలత, ఇండిపెండెంట్లుగా ఆర్.ఎస్. రంజిత్కుమార్, మన్నె గోవర్ధన్రెడ్డి, జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పి.విష్ణువర్ధన్రెడ్డి నామినేషన్లు, ఇండిపెండెంట్గా అబ్దల్లా ఇబ్రహీం, సనత్నగర్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి తలసారి శ్రీనివాస్యాదవ్ నామినేషన్లు వేశారు. ఇండిపెండెంట్లుగా సారపు సుమిత్ర, ఎ. శ్రీనివాస్లు నామినేషన్లు వేశారు. నాంపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి సీహెచ్ ఆనంద్కుమార్గౌడ్, కార్వాన్లో టీఆర్ఎస్ అభ్యర్థి టి.జీవన్సింగ్, గోషామహల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం.ముఖేశ్గౌడ్, ఇండిపెండెంట్గా బీవీ రమేశ్బాబు నామినేషన్లు దాఖలు చేశారు. యాకుత్పురాలో ఎంఐఎం అభ్యర్థి సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి, టీఆర్ఎస్ నుంచి సామ సుందర్రెడ్డి, శివసేన అభ్యర్థిగా జమలాపూర్ మహేశ్కుమార్, ఎన్సీపీ తరఫున ఎస్.సుజాత, సికింద్రాబాద్లో సీపీఐ(ఎం) నుంచి కుంచల అనిల్కుమార్, బహుజన రాజ్యం పార్టీ(పూలే అంబేద్కర్) తరఫున మాడుగుల సునీత, ఇండిపెండెంట్గా ఎస్.సాయికిరణ్, కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీగా పేర్కొంటూ ఎం.మన్మోహన్, ఇండిపెండెంట్లుగా జి.దయామణి, గణేశ్ నారాయణన్, గజ్జెల నాగేశ్వరరావు నామినేషన్లు వేశారు.
మేడ్చల్ జిల్లాలో 20..
సాక్షి,మేడ్చల్జిల్లా: మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం 20 నామినేషన్లు దాఖలయ్యాయి. ముహూర్తం బాగా ఉండడంతో భారీగా నామినేషన్లు నమోదు అయినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాల్లో ఏడేసి చొప్పున 14 మంది నామినేషన్లు వేయగా, కూకట్పల్లి నియోజకవర్గంలో ఒక నామినేషన్ దాఖలైంది. మేడ్చల్ నియోజకవర్గం లో నాలుగు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్.రామచందర్రావు, ఉప్పల్లో టీఆర్ఎస్ అభ్యర్థి బేతి సుభాష్రెడ్డి రెండేసి సెట్ల చొప్పున నామినేషన్లు వేశారు.
ఏ నియోజకవర్గంలో ఎలా..
మేడ్చల్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి పెద్ది(కొంపెల్లి) మోహన్రెడ్డి, కాంగ్రెస్ నుంచి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, ఇండిపెండెంట్లుగా నీరడి హిమావతి, కొమ్ము సత్య నామినేషన్లు దాఖలు చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో టీజేఎస్ నుంచి కపిలవాయి దిలీప్కుమార్, బీజేపీ నుంచి ఎన్.రామచందర్రావు, ఇండిపెండెట్లుగా గోపు రమణారెడ్డి, పావనిరెడ్డి, మధుమోహన్, నర్సింహారావు, అనిల్కుమార్ నామినేషన్లు వేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి కూన శ్రీశైలంగౌడ్, ఇండిపెండెంట్గా అశ్విన్కుమార్ నామినేషన్లు దాఖలు చేశారు. కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి గొట్టిముక్కల వేణుగోపాల్రావు నామినేషన్ దాఖలు చేశారు. ఉప్పల్లో టీఆర్ఎస్ నుంచి బేతి సుభాష్రెడ్డి, టీడీపీ నుంచి తూళ్ల వీరేందర్గౌడ్, ఆమ్అద్మీ పార్టీ నుంచి ప్రియాంక, బీఎస్పీ నుంచి యుగంధర్, శివసేన నుంచి జగదీష్ చౌదరి, ఎఫ్ఐపీ నుంచి అనిల్కుమార్, ఇండిపెండెంట్గా వెంకోజురావు నామినేషన్లు వేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి ఎంవీరెడ్డి తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలో 16 నామినేషన్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మూహూర్తం బాగుందని బుధవారం రంగారెడ్డి జిల్లాలో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయాలకు వరుస కట్టారు. 14వ తేదీ ఒక్కరోజే గ్రేటర్ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి జిల్లాలోని సెగ్మెంట్లలో 16 మంది నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఖరారుకాని అభ్యర్థులు సైతం నామినేషన్లు వేసినవారి జాబితాలో ఉండడం గమనార్హం. అత్యధికంగా ఎల్బీనగర్ నుంచి 8 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ సెగ్మెంట్ను మహాకూటమి ఇంకా ఎవరికీ కేటాయించలేదు. అయితే, తనకే అవకాశం ఇస్తారన్న ధీమాతో మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి కాంగ్రెస్ తరఫున నామినేష¯Œన్ వేశారు. బీజేపీ అభ్యర్థి పేరాల శేఖర్రావుతో పాటు ఇప్పటికే ఒకసారి నామినేష¯Œన్ వేసిన టీఆర్ఎస్ అభ్యర్థి ముద్దగోని రామ్మోహ¯Œన్గౌడ్ మరో సెట్ అందజేశారు. ఫ్యూచర్ ఇండియా పార్టీ అభ్యర్థి ఇటికాల వరుణ్రెడ్డి, శివ్సేన నుంచి ప్రేమ్ గాంధీ, స్వతంత్రులు పిల్లి వెంకటేశ్, కర్ణాటకపు నాగదేవ, ముల్లేటి లక్ష్మీ జగదీశ్వరి నామినేషన్లు వేశారు. మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి నామినేష¯Œన్ పత్రాలు సమర్పించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థి బద్దం బాల్రెడ్డి నాలుగు సెట్లు ఆర్ఓకు సమర్పించారు. టీఆర్ఎస్ అభ్యర్థి టి.ప్రకాశ్గౌడ్, ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ యువనేత పట్లోళ్ల కార్తీక్రెడ్డి కూడా నామినేషన్లు వేశారు. ఇబ్రహీంపట్నం సెగ్మెంట్కు టీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిష¯Œన్రెడ్డి తరఫున ఆయన సతీమణి ముకుంద నామినేషన్Œ పత్రాలను అందజేశారు. ఈ స్థానాన్ని ఆశిస్తున్న కాంగ్రెస్ నేత మల్రెడ్డి రంగారెడ్డి తరఫున ఆయన కుమారుడు అభిషేక్ రెడ్డి నామినేష¯Œన్ పత్రాలు ఆర్ఓకు అందించారు. బీజేపీ నుంచి ఇద్దరు అభ్యర్థులు మర్రిపల్లి అంజయ్య యాదవ్, బండారు రణధీర్రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సపావత్ దేవరామ్ కూడా నామినేషన్లు వేశారు. శేరిలింగంపల్లి స్థానానికి స్వతంత్ర అభ్యర్థి గాదె సరిత నామినేషన్ దాఖలు చేశారు.
మోగుతున్నరె‘బెల్స్’
అసెంబ్లీ ఎన్నికల పోరులో మూడో రోజు ప్రధాన పార్టీలతో పాటు భారీగా ఇండిపెండెంట్లు, తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీలు ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ సీట్లు ఆశించి భంగపడ్డ నేతలు నామినేషన్లు వేశారు. బుధవారం ఉప్పల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భేతి సుభాష్రెడ్డి, యాకుత్పురాలో సుందర్రెడ్డి నామినేషన్లు వేయగా, కాంగ్రెస్ అభ్యర్థులుగా మూల ముఖేష్గౌడ్ (గోషామహల్) విష్ణువర్ధన్రెడ్డి (జూబ్లీహిల్స్), అనిల్కుమార్ యాదవ్ (ముషీరాబాద్), కూన శ్రీశైలం గౌడ్ (కుత్బుల్లాపూర్)లు నామినేషన్లు దాఖలు చేశారు. ఎల్బీనగర్లో దేవిరెడ్డి సుధీర్రెడ్డి తరపున ఆయన అనుచరులు నామినేషన్ వేశారు. రాజేంద్రనగర్లో అధికారికంగా సీటు ఖరారు కానప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థిగా పి.కార్తీక్రెడ్డి నామినేషన్ దాఖలు చేయటం విశేషం. అదే విధంగా మల్కాజిగిరి, ఎల్బీనగర్, మేడ్చల్లలో బీజేపీ అభ్యర్థులు రాంచందర్రావు, పేరాల శేఖర్రావు, కొంపల్లి మోహన్రెడ్డిలు నామినేషన్లు వేశారు. ఉప్పల్లో టీడీపీ అభ్యర్థి వీరేందర్గౌడ్, మల్కాజిగిరిలో టీజేఎస్ అభ్యర్థి దిలీప్కుమార్, ఎంఐఎం అభ్యర్థి పాషాఖాద్రీ యాకుత్పురాలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
తిరుగుబాట్లు..
అధికారిక అభ్యర్థులను కాదని ఆయా పార్టీల నాయకులు తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. మల్కాజిగిరిలో బీజేపీ నేత గోపు రమణారెడ్డి, కంటోన్మెంట్లో కాంగ్రెస్కు రాజీనామా చేసిన గణేష్, కూకట్పల్లిలో కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ వెంగళరావు, టీఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థిగా కంటోన్మెంట్లో గజ్జెల నగేష్ నామినేషన్లు వేశారు. వీరితోపాటు నగరంలో ఖైరతాబాద్లో టీఆర్ఎస్ నేతలు, ఉప్పల్లో కాంగ్రెస్ నాయకులు, మేడ్చల్లో టీఆర్ఎస్ను వీడి మరో రాజకీయ పార్టీ పేరుతో ముఖ్య నాయకులు బరిలోకి నిలిచే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment