
సాక్షి, యాదాద్రి: ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కార్యదర్శి సలీమ్ అహ్మద్ అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో రాహుల్గాంధీ పర్యటనకు వచ్చిన స్పందనతో కేసీఆర్లో అభద్రతాభావం నెలకొందన్నారు.
రాహుల్గాంధీపై ఆరోపణలు చేస్తున్న కేసీఆర్.. నరేంద్ర మోదీని పదేపదే ఎందుకు కలిశారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి నిర్దిష్టమైన ప్రణాళిక ఉందని, దాని ప్రకారం ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. పొత్తులపై చర్చించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని, ఆ కమిటీలో తీసుకున్న నిర్ణయాల మేరకే నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో పీసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్, ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.