
సాక్షి బెంగళూరు: మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ అరెస్ట్ వ్యవహారంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హస్తం ఉన్నట్లు తనకు అనుమానం ఉందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళీన్కుమార్కటీల్ ఆరోపించారు. ఆయన ఆదివారం బాగల్కోటెలో విలేకరులతో మాట్లాడారు. డీకే శివకుమార్ రాజకీయంగా ఎదుగుతున్నారన్న కారణంతో సిద్ధూ రాజకీయంగా కక్ష పెంచుకున్నారని సంచలన వ్యాఖ్యల చేశారు. 2017లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని, సిద్ధూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డీకేశి ఇంటిలో ఐటీ దాడులు జరిగాయని గుర్తు చేశారు.
ఆ సమయంలో నోరు మెదపని సిద్ధూ ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ సర్కార్పై నిందలు వేయడం సమంజసం కాదన్నారు. డీకేశి అవినీతి ఆరోపణలపై అరెస్ట్ అయ్యారని, ఇందులో కేంద్రం హస్తం లేదన్నారు. ఈడీ అన్ని ఆధారాలతో డీకేశిని అరెస్టు చ చేసిందన్నారు. వరదల నేపథ్యంలో సీఎం యడియూరప్ప సుడిగాలిలా పర్యటించారన్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత చురుకుగా పనిచేయలేదన్నారు. బాధితులకు తాత్కాలికంగా రూ.10వేలు పంపిణీ చేయడం ప్రభుత్వ ఘనత అని అన్నారు. గత ప్రభుత్వం ఇళ్లు నిర్మించుకోవడానికి కేవలం రూ.92 వేలు ఇవ్వగా బీజేపీ ప్రభుత్వం రూ.5 లక్షలు ప్రకటించిందన్నారు.