
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 22వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. శాసనసభలో సీఎం కేసీఆర్, శాసనమండలిలో ఆర్థికమంత్రి హరీశ్రావు రాష్ట్రబడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరం శాసనసభా కార్యకలాపాల సంఘం (బీఏసీ) సమావేశమైంది. 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని, ఆదివారం కూడా సమావేశాలు కొనసాగించాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.
చదవండి: తెలంగాణ బడ్జెట్ హైలైట్స్
ఈ నెల 24వ తేదీన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఈ నెపథ్యంలో అక్టోబర్ మధ్యలో అసెంబ్లీలో కొత్త రెవెన్యూ బిల్లు పెట్టే అవకాశముందని తెలుస్తోంది. ఇక, టీ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క సూచించినవిధంగా ఢిల్లీలో మాదిరిగా హైదరాబాద్ కాన్సిస్ట్యూషనల్ క్లబ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక, వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాలు 21 రోజులు పెట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. ఈ నెల 14, 15 తేదీల్లో బడ్జెట్పై చర్చ ఉంటుందని వెల్లడించారు.
ఇక, శాసన మండలిలో ఈ నెల 14న రాష్ట్ర బడ్జెట్పై చర్చ జరగనుంది. 15వ తేదీన బడ్జెట్పై ప్రభుత్వం సమాధానం ఇస్తుంది. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 10న మండలికి సెలవు కాగా, 11వ తేదీన చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఉండనుంది. మళ్లీ 12, 13 తేదీల్లో సెలవులు ఉండనున్నాయి. 14న బడ్జెట్పై చర్చ, 15న బడ్జెట్పై ప్రభుత్వ సమాధానం ఉండనున్నాయి. ఈ నెల 14వ తేదీ నుంచి 22 వరకు మండలి సమావేశాలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment