
సీతారాం ఏచూరి (ఫైల్ ఫోటో)
కోల్కతా: 2019 లోక్సభ ఎన్నికల తరువాతే కూటమిపై చర్చిస్తామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. కోల్కతాలో గురువారం మీడియాతో మాట్లాడిన ఏచూరి పలు అంశాలపై చర్చించారు. ఫెడరల్ ఫ్రంట్పై ఆ ఎన్నికల అనంతరం నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇటీవల జరిగిన పార్టీ జాతీయ మహాసభల్లో.. రానున్న ఎన్నికల్లో మతతత్వ బీజేపీని ఓడించేందుకు లౌకిక శక్తులతో కలిసి పనిచేయాలని సీపీఎం జాతీయ కార్యవర్గం నిర్ణయం తీసుకుందని ఏచూరి తెలిపారు.
ఎన్నికల తర్వాతనే ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, మేం కుడా ఎన్నికల అనంతరమే ఫెడరల్ ఫ్రెంట్పై తమ అభిప్రాయం వ్యక్తం చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలకు యూపీలోని ఎస్పీ-బీఎస్పీ కూటమి మంచి ఉదాహరణగా గుర్తుచేశారు. బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన ఘర్షణలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఏచూరి విమర్శలు గుప్పించారు.
బెంగాల్లో మమత ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్ వేయకుండా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారని ఆరోపించారు. సీఎం మమతకు, ప్రధాని నరేంద్ర మోదీకి రహస్య ఒప్పందాలు ఉన్నాయని, వారిద్దరూ మతతత్వ ఘర్షణలను ప్రోత్సహించేవారేనన్నారు. ‘మోదీ హటావో.. దేశ్ బచావో, మమత హటావో.. బెంగాల్ బచావో’ అంటూ నినాదాలు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరైన మమత, ఏచూరి ఒకే వేదికను పంచుకున్న మరునాడే ఏచూరి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment