
ఇంగ్లండ్ విజయలక్ష్యం 306
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డేలో బంగ్లాదేశ్ 306 పరుగుల లక్ష్యాన్నినిర్దేశించింది.
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డేలో బంగ్లాదేశ్ 306 పరుగుల లక్ష్యాన్నినిర్దేశించింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లు తమీమ్ ఇక్బాల్(128;142 బంతుల్లో 12 ఫోర్లు 3 సిక్సర్లు), ముష్ఫికర్ రహీమ్(79;72 బంతుల్లో 8 ఫోర్లు) లు బాధ్యాతయుతంగా ఆడి గౌరవప్రదమైన స్కోరును ఇంగ్లండ్ ముందుంచారు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ను తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్ లు ఆరంభించారు. అయితే బంగ్లాదేశ్ స్కోరు 56 పరుగుల వద్ద సౌమ్య సర్కార్(28) తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆపై ఇమ్రూల్ కైస్(19) కూడా నిరాశపరిచాడు. ఆ తరుణంలో ఇక్బాల్ కు జత కలిసిన రహీమ్ స్కోరు బోర్డును చక్కదిద్దాడు. వీరిద్దరూ ఆచితూచి బ్యాటింగ్ చేసి 166 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు.
ఆ క్రమంలోనే తమీమ్ ఇక్బాల్ సెంచరీ చేయగా, రహీమ్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. అయితే వీరిద్దరూ 261 పరుగుల వద్ద వరుసగా నిష్ర్రమించడంతో బంగ్లాదేశ్ స్కోరులో వేగం తగ్గింది. కాగా, చివర్లో షబ్బిర్ రెహ్మాన్(24;15 బంతుల్లో 3 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించడంతో బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ప్లంకెట్ నాలుగు వికెట్లతో మెరవగా, బాల్, స్టోక్స్ లకు తలో వికెట్ లభించింది.