
పూనమ్ యాదవ్, మనూ భాకర్, వికాస్ ఠాకుర్
గోల్డ్ కోస్ట్ : కామన్వెల్త్ గేమ్స్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఆదివారం భారత్ ఖాతాలో మరో ఐదు పతకాలు చేరాయి. నాలుగో రోజు వెయిట్ లిఫ్టింగ్ 69 కేజీల విభాగంలో పూనమ్ యాదవ్ స్వర్ణ పతకం గెలవగా.. 10 మీటర్ల మహిళల ఏయిర్ పిస్టల్ విభాగంలో మనూ భాకర్ స్వర్ణం సాధించారు. ఇదే విభాగంలో హీనా సిద్ధు రజత పతకం గెలిచారు. 10 మీటర్ల పురుషుల ఏయిర్ పిస్టల్ విభాగంలో రవికుమార్ కాంస్యం సొంతం చేసుకోగా.. పురుషుల 94 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో వికాస్ ఠాకుర్ కాంస్యపతకం సొంతం చేసుకున్నాడు.
ప్రస్తుతం భారత్ 6 స్వర్ణాలు, రెండు రజతాలు, మూడు కాంస్యలతో మొత్తం11 మెడల్స్తో పతకాల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇందులో ఎనిమిది పతకాలు వెయిట్లిఫ్టింగ్ విభాగంలోనే రావడం విశేషం. ఇక ఈ జాబితాలో 66 పతకాలతో(23 స్వర్ణాలు) ఆస్ట్రేలియా తొలిస్థానంలో ఉండగా.. 37 పతకాలతో(15 స్వర్ణాలు) ఇంగ్లండ్, 23 పతకాలతో(6 స్వర్ణాలు) కెనడా భారత్కన్నా ముందు స్థానాల్లో ఉన్నాయి. 18 పతకాలు గెలిచిన స్కాట్లాండ్ స్వర్ణపతకాల సంఖ్య(4) భారత్ కన్నా తక్కువగా ఉండటంతో ఐదో స్థానానికి పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment