తొలి అడుగు ఎవరిదో! | India v England: Haseeb Hameed to make England debut in first Test | Sakshi
Sakshi News home page

తొలి అడుగు ఎవరిదో!

Published Wed, Nov 9 2016 12:51 AM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM

తొలి అడుగు ఎవరిదో!

భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు నేటి నుంచి
 ఫేవరెట్‌గా కోహ్లిసేన  

 
 ఓ వైపు ప్రపంచ నంబర్‌వన్ జట్టు... మరోవైపు గత దశాబ్దంలో భారత్‌ను భారత్‌లోనే ఓడించిన ఏకై క జట్టు... ఓ రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. భారత్, ఇంగ్లండ్‌ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌కు నేడు రాజ్‌కోట్ వేదికగా తెరలేవనుంది. ఫామ్, సొంతగడ్డపై అనుకూలత తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుంటే భారత జట్టే ఈ సిరీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అటు ఇంగ్లండ్ తమని తాము అండర్‌డాగ్‌‌స అని చెప్పుకుంటూనే పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఏమైనా ఐదు టెస్టుల సిరీస్‌లో మొదటి మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే రాజ్‌కోట్‌లో నేటి నుంచి జరిగే తొలి మ్యాచ్ ఈ సిరీస్‌కే కీలకం.  
 
 రాజ్‌కోట్: చివరిసారిగా భారత్ సొంతగడ్డపై టెస్టు మ్యాచ్ ఓడిపోయి నాలుగేళ్లయింది. 2012లో కోల్‌కతాలో ఇంగ్లండ్ చేతిలో ఓడిన తర్వాత స్వదేశంలో 14 టెస్టుల్లో భారత్ ఎప్పుడూ ఓడిపోలేదు. కాబట్టి ఫామ్ పరంగా భారత్ ఈ సిరీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అరుుతే సంప్రదాయ క్రికెట్‌లో ఇంగ్లండ్ ఎప్పుడూ బలమైన జట్టే. బంగ్లాదేశ్‌లో స్పిన్ ధాటికి సిరీస్‌ను డ్రా చేసుకుని వచ్చినందున... అందరూ స్పిన్ ఆడటంలో ఇంగ్లండ్ బలహీనం అని భావిస్తున్నారు. అయితే కుక్ అండ్ కోను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మరోవైపు భారత్ తమ బలంతోనే ఆడతామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ నేడు మొదలు కాబోతోంది. రాజ్‌కోట్‌లో బుధవారం నుంచి జరిగే తొలి టెస్టులో భారత్ ఇంగ్లండ్‌తో తలపడుతుంది.
 
 ఇద్దరే స్పిన్నర్లు!
 తొలి టెస్టు ఆరంభానికి ముందు జట్టు కూర్పు విషయంలో భారత్‌కు ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. గంభీర్, విజయ్ ఓపెనర్లు. పుజారా, కోహ్లి, రహానే, సాహా జట్టులో ఉండటం ఖాయం. మిగిలిన ఐదు స్థానాల్లో ఎవరెవరు ఆడతారనేది చూడాలి. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో పుజారా, రహానే అద్భుతమైన ఫామ్‌ను కనబరిచారు. కోహ్లి కూడా ఓ డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. గంభీర్ కూడా తనకు రెండేళ్ల తర్వాత లభించిన అవకాశాన్ని వినియోగించుకుని అర్ధసెంచరీ చేశాడు. బ్యాటింగ్ విభాగంలో భారత్‌కు పెద్దగా ఆందోళన లేదు. ఇక బౌలింగ్ విభాగంలో అశ్విన్, జడేజా, షమీ తుది జట్టులో ఉండటం ఖాయం. మిగిలిన రెండు బెర్త్‌లు ఎవరివో తేలాల్సి ఉంది. అదనపు బ్యాట్స్‌మన్ కావాలనుకుంటే కరుణ్ నాయర్‌కు అరంగేట్రం చేసే అవకాశం దక్కుతుంది. లేదా ఐదుగురు బౌలర్ల వ్యూహం అయితే హార్ధిక్ పాండ్యా అరంగేట్రం చేస్తాడు. మొత్తానికి ఈ ఇద్దరిలో ఒకరు తుది జట్టులో ఉండొచ్చు. ఇక ముగ్గురు స్పిన్నర్లతో ఆడితే అమిత్ మిశ్రా... ఇద్దరు స్పిన్నర్లు చాలనుకుంటే ఇషాంత్ శర్మ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. పిచ్ స్వభావం, కోహ్లి మాటలను బట్టి చూస్తే ఈ మ్యాచ్‌కు ఇద్దరు స్పిన్నర్లు మాత్రమే ఆడే అవకాశం కనిపిస్తోంది. హార్ధిక్ పాండ్యాకే నాయర్ కంటే ఎక్కువగా అవకాశాలు ఉన్నారుు.
 
 ముగ్గురు పేసర్లు... ముగ్గురు స్పిన్నర్లు
 జట్టు కూర్పు విషయంలో భారత్‌తో పోలిస్తే ఇంగ్లండ్ పని కాస్త సులభంగానే ఉంది. కుక్‌తో పాటు కొత్త కుర్రాడు హసీబ్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నాడు. 19 ఏళ్ల ఈ యువ ఆటగాడు స్పిన్ బాగా ఆడతాడని ఆ జట్టు భావించి అరంగేట్రం చేరుుస్తోంది. ఇక గత రెండేళ్లుగా ఇంగ్లండ్ ప్రధానంగా ఆధారపడ్డ బ్యాట్స్‌మన్ రూట్. తనతో పాటు మొయిన్ అలీ, డకెట్, స్టోక్స్, వికెట్ కీపర్ బెరుుర్‌స్టో గమనించదగ్గ బ్యాట్స్‌మన్. ఇక స్పిన్ విభాగంలో మొయిన్‌తో పాటు రషీద్, గ్యారత్ బ్యాటీ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. బ్రాడ్ , వోక్స్‌లతో కలిసి స్టోక్స్ పేస్ బాధ్యతలు పంచుకుంటాడు. మొత్తం మీద ముగ్గురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లు తుది జట్టులో ఉండబోతున్నారు. ఇందులో ముగ్గురు ఆల్‌రౌండర్లు కావడం వల్ల బ్యాటింగ్ లైనప్ కూడా బలంగా కనిపిస్తోంది. ఏమైనా సొంతగడ్డపై ప్రమాదకరమైన అశ్విన్‌ను ఎలా అడ్డుకుంటారనే అంశంపై ఇంగ్లండ్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.
 
 జట్లు (అంచనా)
 భారత్: కోహ్లి (కెప్టెన్), గంభీర్, విజయ్, పుజారా, రహానే, సాహా, పాండ్యా, అశ్విన్, జడేజా, షమీ, ఇషాంత్/మిశ్రా.
 ఇంగ్లండ్: కుక్ (కెప్టెన్), హసీబ్, రూట్, డకెట్, మొయిన్ అలీ, స్టోక్స్, బెరుుర్‌స్టో, వోక్స్, రషీద్, బ్రాడ్, గ్యారత్ బ్యాటీ.
 
 డ్రా చేసుకున్నా నంబర్‌వన్
 ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను డ్రా చేసుకున్నా భారత జట్టు నంబర్‌వన్ ర్యాంక్ పదిలంగా ఉంటుంది. ప్రస్తుతం టాప్-4లో ఉన్న జట్ల (భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) అంతరం పది పాయింట్లు మాత్రమే ఉంది. అయితే భారత్ ఓడిపోరుునా... మిగిలిన సిరీస్‌ల ఫలితాల ఆధారంగా నంబర్‌వన్‌లో ఉండవచ్చు. ఇంగ్లండ్‌తో డ్రా చేసుకుంటే మాత్రం... ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా ఈ ఏడాదిని నంబర్‌వన్‌గా ముగించవచ్చు.
 
 కీలకం
 భారత్: సిరీస్‌లో స్పిన్ వికెట్లు ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత్ తరఫున ప్రధానంగా పుజారా, రహానే రాణించడం కీలకం. ఈ ఇద్దరూ కుదురుగా ఆడితే భారత్‌కు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. బౌలింగ్‌లో అశ్విన్, జడేజాలదే ప్రధాన భూమిక.ఇంగ్లండ్: ఎప్పటిలాగే కుక్, రూట్‌ల మీద ఇంగ్లండ్ ఆశలు పెట్టుకుంది. ఈ ఇద్దరూ బాగా ఆడితే తప్ప ఇంగ్లండ్‌కు బ్యాటింగ్‌లో వేరే గొప్ప ప్రత్యామ్నాయాలు కనిపించడం లేదు. స్పిన్ విభాగంలో కాస్త బలహీనంగా ఉన్నా... పేసర్లతో రివర్స్ స్వింగ్ రాబట్టాలనేది ఇంగ్లండ్ వ్యూహం. భారత వికెట్లపై ఇది ఎంత మేరకు ఫలిస్తుందో చూడాలి.
 
 పిచ్, వాతావరణం
 క్యురేటర్ చెబుతున్న మాటల ప్రకారం నాలుగో రోజు నుంచి బంతి బాగా స్పిన్ అవుతుంది. తొలి మూడు రోజులు బ్యాట్స్‌మెన్‌కు అనుకూలం అంటున్నారు. కాబట్టి తొలి ఇన్నింగ్‌‌సలో భారీస్కోరు చేయడం కీలకం. టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. డే మ్యాచ్ అయినా ఉదయం మంచు ప్రభావం కొద్దిసేపు పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ప్రస్తుతానికై తే వర్షం ప్రమాదమేమీ లేదు.
 
 ఉ. గం. 9.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
 
 రాజ్‌కోట్‌లో ఇదే తొలి టెస్టు మ్యాచ్. టెస్టులకు ఆతిథ్యం ఇస్తున్న 23వ భారత వేదిక రాజ్‌కోట్.
 
 ఇంగ్లండ్ పేసర్ బ్రాడ్‌కు ఇది వందో టెస్టు మ్యాచ్.
 
 కెప్టెన్‌గా కుక్‌కు ఇది 54వ మ్యాచ్. ఈ మ్యాచ్‌తో ఇంగ్లండ్‌కు
 అత్యధిక మ్యాచ్‌ల్లో సారథ్యం వహించిన క్రికెటర్‌గా రికార్డు సాధిస్తాడు.
 
 భారత్, ఇంగ్లండ్‌ల మధ్య ఇప్పటివరకూ 112 టెస్టులు జరగ్గా భారత్ 21 గెలిచింది. ఇంగ్లండ్ 43 గెలవగా... 48 టెస్టులు డ్రాగా ముగిశారుు.
 

 ‘డీఆర్‌ఎస్ రాకెట్ సైన్‌‌స కాదు. దానిని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పనిలేదు. సమయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. జట్టుగా మా ఆలోచనా ధోరణి కూడా మారింది. పోటీ ఇవ్వడం నుంచి విజయాలు సాధించడం లక్ష్యంగా మార్చుకున్నాం. మేం బాగా ఆడుతున్నా ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. జట్టు కూర్పు గురించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మన బలానికి అనుగుణంగా సరైన కూర్పుతో బరిలోకి దిగడం ముఖ్యం. దీనివల్లే మేం ఇంతకాలం మెరుగైన ఫలితాలు సాధించాం. అలాగే గత రికార్డుల గురించి మేం ఎప్పుడూ ఆలోచించం. ఎందుకంటే మనం వాటిని మార్చలేం. ఈ రోజు, ఈ మ్యాచ్‌లో ఎలా ఆడాలి అనే వరకే ఆలోచిస్తాం. పెద్ద జట్లతో ఆడినప్పుడే మన అసలు సత్తా బయట పడుతుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఫలితం ఎప్పుడూ కీలకమే. ప్రతి టెస్టూ ఐదు రోజులు జరిగితే 25 రోజులు మైదానంలో ఉండాలి. కాబట్టి తొలి రోజు నుంచే మనం సరైన దిశలో సాగాలి.’     - విరాట్ కోహ్లి
 
 ‘ఈ సిరీస్ తర్వాత నేను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానంటూ వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. భారత్‌లో సిరీస్ ఆడటం ఎప్పుడైనా పెద్ద సవాలే. మాపై అంచనాలు లేని మాట వాస్తవం. అయితే ఇలాంటి సందర్భాల్లో మేం గతంలో అద్భుతాలు చేశాం. కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా మ్యాచ్‌ను ప్రారంభించడం ముఖ్యం. తొలి టెస్టు ద్వారా హసీబ్ అహ్మద్ అరంగేట్రం చేస్తాడు. తను స్పిన్ బాగా ఆడతాడు. మిగిలిన జట్టు గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం అశ్విన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కాబట్టి తన ఆత్మవిశ్వాసం బాగుంటుంది. నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు అతనికి మా ఆటతీరుపై అవగాహన కూడా బాగుంటుంది. కాబట్టి ఈ సిరీస్‌లో అతడిని సమర్థంగా ఎదుర్కోవడమే కీలకం. డీఆర్‌ఎస్ ఉండటం ఎప్పుడైనా మంచిదే.’     - అలిస్టర్ కుక్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement