సింధు శుభారంభం | P.V. Sindhu enters the second round of Kumpoo Macau Open 2013 | Sakshi
Sakshi News home page

సింధు శుభారంభం

Published Thu, Nov 28 2013 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM

ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ యువతార పి.వి.సింధు మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది.

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ యువతార పి.వి.సింధు మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. మకావు సిటీలో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో టాప్ సీడ్ సింధు 15-21, 21-12, 21-9తో కిమ్ సూ జిన్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది.
 
 
 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు స్మాష్‌లతో చెలరేగి 26 పాయింట్లు సంపాదించింది. ఇదే టోర్నీలో భారత్‌కే చెందిన సయాలీ గోఖలే, పి.సి.తులసీ కూడా రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. తొలి రౌండ్‌లో మహారాష్ట్ర క్రీడాకారిణి సయాలీ 24-22, 21-15తో చీ యా చెంగ్ (చైనీస్ తైపీ)పై నెగ్గగా... కేరళ అమ్మాయి తులసీ 22-20, 21-19లో రెండో సీడ్ నిచావోన్ జిందాపోన్ (థాయ్‌లాండ్)ను బోల్తా కొట్టించింది.
 
 పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు భమిడిపాటి సాయిప్రణీత్ 19-21, 17-21తో సోల్ కూ చోయ్ (దక్షిణ కొరియా)చేతిలో ఓటమి పాలయ్యాడు. పీ రోంగ్ వాంగ్-కువో యూ వెన్ (చైనీస్ తైపీ) జంటతో జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం తొలి గేమ్‌లో 0-2తో వెనుకంజలో ఉన్న దశలో గాయం కారణంగా వైదొలిగింది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో కోనా తరుణ్-అశ్విని పొన్నప్ప జోడి 10-21, 21-17, 13-21తో నిపిత్‌పోన్-పుతియా సుపాజిర్‌కుల్ (థాయ్‌లాండ్) జంట చేతిలో ఓడిపోయింది. గురువారం జరిగే రెండో రౌండ్‌లో ప్రపంచ 62వ ర్యాంకర్ సలక్‌జిత్ పొన్సానా (థాయ్‌లాండ్)తో సింధు ఆడుతుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement