
గువాహటి: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో తెలంగాణకు చెందిన చిట్టబోయిన రాహుల్ యాదవ్, రోహిత్ యాదవ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్ల్లో రాహుల్ 21–12, 21–11తో డి. జశ్వంత్ (ఆంధ్రప్రదేశ్)పై... రోహిత్ 21–19, 21–19తో ప్రతుల్ జోషి (రైల్వేస్)పై విజయం సాధించారు.
ఈ ఇద్దరితోపాటు లక్ష్య సేన్ (ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా), ఆలాప్ మిశ్రా (మధ్యప్రదేశ్), హర్షీల్ డాని (మహారాష్ట్ర), ఆర్యమాన్ టాండన్ (ఎయిరిండియా), కౌశల్ (మహారాష్ట్ర), సౌరభ్ వర్మ (పీఎస్పీబీ) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరారు. మహిళల సింగిల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి (తెలంగాణ), గుమ్మడి వృశాలి (ఆంధ్రప్రదేశ్) నాలుగో రౌండ్లో ఓటమి చవిచూశారు. గాయత్రి 17–21, 17–21తో రియా ముఖర్జీ (రైల్వేస్) చేతిలో ఓడిపోగా... శ్రుతి ముందాడ (మహారాష్ట్ర)తో జరిగిన మ్యాచ్లో తొలి గేమ్ను 19–21తో కోల్పోయి... రెండో గేమ్లో 2–10తో వెనుకబడిన దశలో వృశాలి గాయం కారణంగా వైదొలిగింది.
Comments
Please login to add a commentAdd a comment