
లండన్: భారత్-ఇంగ్లండ్ మధ్య ఆగస్టు1 నుంచి జరిగే తొలి టెస్టు మ్యాచ్కు సిద్దం చేసిన పిచ్ను గ్రౌండ్స్మెన్ కూడా అంచనా వేయలేరని ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. తొలి టెస్టు నేపథ్యంలో క్రిక్ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
‘ఇరు జట్లకూ ఈ సిరీస్ ఎంతో అద్భుతంగా నిలవనుంది. కానీ ఇంగ్లండ్లో ప్రస్తుత వాతావరణాన్ని బట్టి చూస్తే మైదానం సిబ్బంది కూడా పిచ్ ఎవరికి అనుకూలిస్తుందో అంచనా వేయలేరు. ఆటగాళ్లే పరిస్థితులను ఆకళింపు చేసుకోని ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ట్రెంట్ బ్రిడ్జి నుంచి లార్డ్స్ వరకు ప్రతి మైదానం ప్రత్యేకమే. అలాంటి సమయాల్లో బౌలర్లు అక్కడి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటేనే విజయం వరిస్తోంది. ఇక సిరీస్ ఎవరిని వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. ఒకవేళ పిచ్లు స్పిన్నర్లకు అనుకూలిస్తే కచ్చితంగా వారిపై పనిభారం పడుతుంది.
అలా అని ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువ ఓవర్లు వేసే అవకాశం ఉండదనుకోలేం. ప్రస్తుతానికి భారత్ సమతూకంగా కనిపిస్తోంది. ఎలాంటి పరిస్థితులనైనా అనుకూలంగా మార్చుకొని సత్తా చాట గల నాణ్యమైన ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. దీంతో ఇరు జట్ల మధ్య పోరు కఠినంగానే కొనసాగనుంది. ఏ జట్టు అయితే పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని అత్యుత్తమ ఆటను ఆడుతుందో అదే చివరికి విజయం సాధిస్తుంది. నా విషయానికి వస్తే సిరీస్ను ఆస్వాదించాలని అనుకుంటున్నాను.’ అని బ్రాడ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment