
విరాట్ కోహ్లి ఔట్
ఆస్ట్రేలియాతో ధర్మశాలలో జరగనున్న కీలకమైన నాలుగో టెస్టులో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాంచీ టెస్టులో భుజానికి గాయమైన కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. దీంతో సిరీస్ ఎవరి వశం కానుందో తేల్చే ఈ టెస్టులో జట్టుకు అజింక్యా రహానే సారథిగా వ్యవహరించనున్నాడు. నాలుగు టెస్టుల సిరీస్ను ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా చెరో విజయంతో సమం చేశాయి.
నాలుగో టెస్టు కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు నేటి (శనివారం) నుంచి బరిలోకి దిగబోతున్నాయి. ఈ హోరాహోరీ పోరుకు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం స్టేడియం ‘తొలిసారి’గా వేదిక కానుంది. ఈ సిరీస్కు ముందు భారత జట్టు స్వదేశంలో అద్భుత ఆటతీరుతో.. వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్లను మట్టికరిపించి అజేయంగా నిలిచింది. తాజాగా ఆస్ట్రేలియా జట్టును కూడా ఇదే కోవలోకి చేర్చాలనే కసితో విరాట్ సేన ఉంది. అయితే 1-1తో సిరీస్ సమంగా ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ఈ కీలక మ్యాచ్లో కెప్టెన్ కోహ్లి లేకపోవడం.. భారత్కు కొంత ప్రతికూలతేనని అంటున్నారు.
ఇక మూడో టెస్టులో భారత్ విజయావకాశాలను సమర్థంగా అడ్డుకున్న ఆస్ట్రేలియా జట్టు ఫుల్ జోష్లో ఉంది. నైతికంగా తామే గెలిచామనే భావనతో చివరి టెస్టులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. ప్యాట్ కమిన్స్, హేజల్వుడ్ దూకుడుకు ఇక్కడి బౌన్సీ పిచ్ సహకారం అందిస్తే భారత్కు తిప్పలు తప్పవు. వార్నర్ మినహా అంతా ఫామ్లో ఉండటం జట్టుకు కలిసొచ్చే్చ అంశం. దీంతో 2004 అనంతరం భారత గడ్డపై ఓ టెస్టు సిరీస్ను దక్కించుకోవడంతో పాటు వరుసగా మరోసారి ఈ ట్రోఫీని గెల్చుకోవాలని ఆసీస్ ఉవ్విళ్లూరుతోంది.