
భారత్ కు స్వల్ప లక్ష్యం
మూడు టీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ సోమవారం భారత్ తో జరుగుతున్న రెండో మ్యాచ్లో జింబాబ్వే 100 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.
హరారే: మూడు టీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ సోమవారం భారత్ తో జరుగుతున్న రెండో మ్యాచ్లో జింబాబ్వే 100 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే ఆది నుంచి భారత బౌలర్ల దెబ్బకు విలవిల్లాడింది. బరిందర్ శ్రవణ్ జింబాబ్వే పతనాన్ని శాసించాడు. శ్రవణ్ నాలుగు ఓవర్లలో 10 పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు సాధించాడు.
జింబాబ్వే ఓపెనర్ చిబాబా(10)ను తొలి వికెట్ గా పెవిలియన్ కు పంపిన శ్రవణ్.. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ లో మూడు వికెట్లు తీశాడు. మసకద్జా(10), సికిందర్ రాజా(1), ముతోంబోడ్జి(0)లను ఒకే ఓవర్ లో శ్రవణ్ అవుట్ చేశాడు. దీంతో జింబాబ్వే ఐదు ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది. కాగా, జింబాబ్వే ఆటగాడు మూర్(31) మోస్తరుగా ఫర్వాలేదనిపించడంతో జింబాబ్వే నిర్ణీతో ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. భారత మిగతా బౌలర్లలో బూమ్రా మూడు వికెట్లు తీయగా, కులకర్ణి, చాహల్లకు తలో వికెట్ దక్కింది.