
పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న బాలిక
విచారణలో పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న మైనర్ బాలిక
మానసిక వైద్యులతో చికిత్స అందించాలని నిర్ణయించిన పోలీసులు
శివమొగ్గ : తనకు ఎస్ఐ ఉద్యోగం వచ్చిందని తల్లిదండ్రులను మభ్యపెట్టి డబ్బుతో ఉడాయించి చివరకు ఓ ఆటో డ్రైవర్ను ప్రేమ వివాహం చేసుకున్న నగరానికి చెందిన మైనర్ బాలిక...తాను పోలీసు అధికారినేనంటూ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది.
ఆ బాలికను వివాహం చేసుకున్న నగరానికి చెందిన ఆటో డ్రైవర్ సురేష్ను పోలీసులు శుక్రవారం అరెస్టుచేసి కోర్టులో హాజరు పరచిన విషయం తెలిసిందే. శనివారం జయనగర పోలీస్స్టేషన్ ఎస్ఐ ఎంసీ.మధు ఆ బాలికను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా..తాను నిజంగా పోలీస్ అధికారిని అని దబాయించింది. జవరేగౌడ అనే పోలీస్ ఉద్యోగం ఇప్పించారని, ఆయన సూచనమేరకు యూరఫ్, సింగపూర్ దేశాల్లో పోలీస్ శిక్షణ తీసుకుని వచ్చానని చెబుతుంది.
దీంతో పోలీసులు ఆ యువతి చదివిన కళాశాలలో ఆరా తీయగా పీయూసీ ద్వితీయసంవత్సరం పరీక్షల్లో ఫెయిల్ అయినట్లు తేలింది. దీంతో ఆ బాలికను శివమొగ్గ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి మానసిక వైద్యులతో చికిత్స అందించాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా తమ కుమార్తె నును తీసుకెళ్లిన డ్రైవరు సురేశ్ పైనే అనుమానంగా ఉందని, ఈ ఘటన వెనుక మరికొందరి వ్యక్తుల ప్రమేయం ఉందని, డబ్బుల కోసం నాటకం ఆడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.