అధిక విలువ కలిగిన నోట్ల రద్దు వల్ల సాధారణ ప్రజలే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారంటూ విపక్షాలు సోమవారం దేశవ్యాప్తంగా హర్తాళ్ కు పిలుపునిచ్చాయి. హర్తాళ్ ద్వారా ప్రజల కష్టాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని కూడా పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని తెలంగాణ, ఏపీలో హర్తాళ్ కు మద్దతు తెలుపుతున్నట్లు వైఎస్సార్సీపీ ప్రకటించిన విషయం తెలిసిందే.
శ్రీకాకుళం: తెల్లవారుజామునుంచే జిల్లాలోని ఆర్టీసీ డిపో వద్ద విపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. ఆర్టీసీ బస్సులను ఆందోళనకారులు అడ్డుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి పదకొండు మందిని అరెస్టు చేశారు. వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారంను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పాలకొండలో నిరసన ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేత వి.కళావతిని అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు.
వైఎస్సార్ జిల్లా: కడప, ప్రొద్దుటూరుల్లోని ఆర్టీసీ డిపోల్లో కాంగ్రెస్, సీపీఐ నేతలు ధర్నాకు దిగారు. బస్సులను అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
పశ్చిమగోదావరి: జిల్లాలోని జంగారెడ్డి గూడెం బస్టాండ్ వద్ద వైఎస్సార్సీపీ, వామపక్ష పార్టీలు ధర్నాకు దిగాయి. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ద్వారకా తిరుమలలో వైఎస్సార్సీపీతో కలిసి వామపక్షాలు బంద్ ను నిర్వహించాయి. ఏలూరులో వైఎస్సార్సీపీ శ్రేణులు బైక్ ర్యాలీని నిర్వహించారు.
ప్రకాశం: జిల్లాలోని చీరాలలో వైఎస్సార్సీపీ, వామపక్షాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. హర్తాళ్ కు మద్దతుగా కందుకూరులో వైఎస్సార్సీపీ, వామపక్ష ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. దర్శి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేత బూచేపల్లి శివ ప్రసాద్ ఆధ్వర్యంలో హర్తాళ్ నిర్వహించారు.
తూర్పు గోదావరి: సామర్లకోట స్టేషన్ సెంటర్లో వైఎస్సార్సీపీ హర్తాళ్ ను నిర్వహించింది. కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు తోట సుబ్బరాయుడు, ఆవాల లక్మీ నారాయణ సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విశాఖపట్టణం: జిల్లాలోని మునగపాకలో వైఎస్సార్సీపీ నేత బొడ్డేడ ప్రసాద్, మద్దిలపాలెంలో వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. పాయకరావుపేటలో హర్తాళ్ లో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేత ధనిశెట్టి బాబూరావుతో సహా సీపీఎం, సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అనకాపల్లిలో వైఎస్సార్సీపీ, వామపక్షాలు ఆందోళనలు చేపట్టాయి.
నెల్లూరు: కోవూరులో వైఎస్సార్సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆత్మకూరులో ఆందోళన చేపట్టిన వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
కృష్ణా: జిల్లాలోని జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో ముందు వైఎస్సార్సీపీ నేతలు బైఠాయించారు. జగ్గయ్యపేటలో కార్యకర్తలతో ర్యాలీని నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ నేత సామినేని ఉదయభాను పోలీసులు అరెస్టు చేశారు. నందిగామలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు.
చిత్తూరు: తిరుపతిలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్యే నారాయణ రెడ్డిలు ఆందోళన చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు భూమన, నారాయణ రెడ్డిలను అరెస్టు చేశారు. ఆర్టీసీ బస్టాండులో పోలీసులు బందోబస్తు మధ్య అధికారులు బస్సులను నడుపుతున్నారు.
మరో వైపు వైఎస్సార్ సీపీ నేత కోనేటి ఆదిములం ఆధ్వర్యంలో నారాయణ వనం హైవేపై కార్యకర్తలు ధర్నా నిర్వహిస్తున్నారు. వాల్మీకిపురంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆందోళన చేపట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన చేపట్టారు. విద్యాసంస్ధలు, వాణిజ్య సముదాయాలు స్వచ్చందంగా మూతపడ్డాయి.
గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా, మేరుగ నాగార్జునల ఆధ్వర్యంలో గుంటూరు ఆర్టీసీ బస్టాండును కార్యకర్తలు ముట్టడించారు. మరో వైపు వామపక్షాలు బస్సులను డిపో నుంచి కదలినివ్వకుండా అడ్డుకుంటున్నాయి. దాచేపల్లికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత జంగా కృష్ణమూర్తి, చిలకలూరిపేట వైఎస్సార్సీపీ నేత మర్రి రాజశేఖర్ లను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
అనంతపురం: ఉరవకొండ ఆర్టీసీ డిపో ఎదుట సీపీఐ, కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. గుత్తి, గుంతకల్లులలో ఆందోళనలు చేపట్టిన వైఎస్సార్సీపీ, వామపక్షాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు జాగ్రత్తగా వైఎస్సార్సీపీ నేత వై. వెంకటరామిరెడ్డిని గృహనిర్బంధం చేశారు.
కదిరిలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేత డా.సిద్ధారెడ్డి సహా 100మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కర్నూలు: కర్నూలు ఆర్టీసీ డిపో ఎదుట ధర్నాకు దిగిన వైఎస్సార్సీపీ నేత హఫీజ్ ఖాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. బస్సుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఆలూరులో నిర్వహించిన హర్తాళ్ లో అఖిలపక్ష నేతలు పాల్గొన్నారు.
విజయనగరం: హర్తాళ్ కు మద్దతుగా జిల్లాలోని అన్ని ప్రైవేటు విద్యాసంస్ధలు, థియేటర్లు, వాణిజ్య సముదాయాలు స్వచ్చందంగా మూతపడ్డాయి. విజయనగరం చాంబర్ ఆఫ్ కామర్స్ కూడా హర్తాళ్ కు మద్దతు ప్రకటించింది.
మహబూబాబాద్: మహబూబాబాద్ ఆర్టీసీ డిపో ముందు ఆందోళనకారులు బైఠాయించారు. దీంతో బస్సు సర్వీసులు నిలిచిపోయాయి.
కరీంనగర్: కరీంనగర్ ఆర్టీసీ డిపోలో బస్సులను అడ్డుకునేందుకు సీసీఎం యత్నించింది. దీంతో జిల్లా కార్యదర్శి ముకుందరెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బస్సు సర్వీసులు యథావిధిగా నడుస్తున్నాయి.
మెదక్: జిల్లాలో హర్తళ్ ప్రభావం కనిపించడం లేదు. ఆర్టీసీ సర్వీసులను నడుపుతోంది.
సంగారెడ్డి: సంగారెడ్డిలో హర్తళ్ ప్రభావం కనిపించడం లేదు. ఆర్టీసీ బస్సుల సర్వీసులు యథావిధిగా కొనసాగుతున్నాయి.
ఖమ్మం: జిల్లాలోని సత్తుపల్లి డివిజన్ లో హర్తాళ్ ప్రభావం కనిపిస్తోంది. వ్యాపారులు, వాణిజ్య సముదాయాలు స్వచ్చందంగా మూతపడ్డాయి. వైరాలో అఖిపక్షం ఆధ్వర్యంలో హర్తాళ్ కొనసాగుతోంది.
భద్రాద్రి కొత్తగూడెం: వామపక్షాల ఆధ్వర్యంలో అశ్వారావుపేటలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దుకాణాలు, పాఠశాలలు మూతపడగా పోలీసుల అండతో ఆర్టీసీ సర్వీసులు కొనసాగుతున్నాయి. కాగా, పినపాక నియోజవర్గంలో వామపక్షాలు చేపట్టిన బంద్ పాక్షికంగానే కొనసాగుతోంది.
మరిన్ని జిల్లాలకు సంబంధించిన సమాచారం అందాల్సివుంది.