కోర్టులో చార్జ్షీట్
26న హాజరు కావాలని ఆదేశం
సాక్షి, చెన్నై : మాజీ సీఎం, ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం సోదరుడు ఓ రాజ మెడకు పూజారి నాగముత్తు ఆత్మహత్య కేసు బిగుసుకుంటోంది. రాజాతో పాటుగా ఏడుగురి మీద కోర్టులో గురువారం చార్జ్ షీట్ దాఖలైంది. ఆ ఏడుగుర్ని ఈనెల 26న కోర్టులో హాజరు పరచాలని పెరియకుళం మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి మారియప్ప ఆదేశాలు జారీ చేశారు.
ఓ పన్నీరు సెల్వం సీఎంగా ఉన్న సమయంలో ఆయన సోదరుడు, పెరియకుళం మునిసిపాలిటీ చైర్మన్ ఓ రాజ సాగించిన వ్యవహారాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనపై బయలు దేరిన ఆరోపణలు, ఫిర్యాదుల్ని ప్రస్తుతం అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత తీవ్రంగా పరిగణించి ఉన్నారు. కైలాశ నాథ ఆలయం పూజారి నాగముత్తు ఆత్మహత్య కేసులో రాజ ప్రమేయం ఉన్నట్టుగా వస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చే రీతిలో ఇటీవల కాలంగా రాజకు వ్యతిరేకంగా పరిస్థితులు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ఆయన చేతిలో ఉన్న పదవులు ఊడినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. అలాగే, సీబీసీఐడీ రంగంలోకి దిగడం, విచారణ వేగవంతం చేయడంతో పన్నీరు సోదరుడు రాజ ఇక జయలలిత ఆగ్రహానికి గురి కావడంతో పాటుగా చిక్కుల్లో పడ్డట్టేనని అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటూ వచ్చాయి.
చార్జ్ షీట్ దాఖలు :
పూజారి ఆత్మహత్య కేసు విచారణను వేగవంతం చేసిన సీబీసీఐడీ చార్జ్ షీట్ను సిద్ధం చేసింది. పూజారి నాగముత్తు రాసి పెట్టిన లేఖ ఆధారంగా సాగిన విచారణ మేరకు చార్జ్ షీట్లో ఓ రాజ పేరును చేర్చారు. అలాగే, రాజ సన్నిహితులు, అన్నాడీఎంకే నాయకు లు పాండి, శివకుమార్, జ్ఞానం, లోగు, శరవణన్, ముత్తు పేర్లను ఈ చార్జ్ షీట్లో పెట్టారు. ఈ చార్జ్షీట్లో ఆ ఏడుగురి ఒత్తిళ్లు తాళ లేక నాగముత్తు ఆత్మహత్య చేసున్నట్టు ఆధారాలతో సీబీసీఐడీ నిరూపించినట్టుగా సంకేతా లు వెలువడుతున్నాయి. ఈ చార్జ్ షీట్ ను పరిశీలించిన పెరియకుళం మెజి స్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి మారియప్పన్ విచారణకు నిర్ణయించారు. ఈ నెల 26న చార్జ్షీట్లో పేర్కొన బడిన వారందరూ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పటికే రాజ ముందస్తు బెయిల్ పొంది ఉండడం గమనార్హం.
మాజీ సీఎం సోదరుడిపై చార్జ్ షీట్
Published Fri, Jun 5 2015 3:32 AM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM
Advertisement
Advertisement