
టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి అరెస్ట్
చెన్నై: అక్రమంగా భారీ మొత్తంలో డబ్బు, బంగారం దాచిన కేసులో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు సోదరుడిని, ఆడిటర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వీరిని చెన్నై సీబీఐ కోర్టులో హాజరుపరచగా జనవరి 3వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
శేఖర్రెడ్డి సహా చెన్నైలోని నలుగురు తెలుగు పారిశ్రామికవేత్తల ఇళ్లపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఇటీవల దాడులు చేసి మొత్తం రూ. 106.52 కోట్ల నగదు, రూ. 36.29 కోట్ల విలువ చేసే 127 కిలోల బంగారం, అనేక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో పెద్ద మొత్తంలో దొరికిన సొమ్ము ఇదేనని ఆదాయపన్నుశాఖ వెల్లడించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక శేఖర్ రెడ్డిని టీటీడీ సభ్యుడిగా నియమించారు. ఈ కేసు వెలుగుచూసిన తర్వాత శేఖర్ రెడ్డిని టీటీడీ బోర్డు సభ్యత్వం నుంచి తొలగించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే సెక్షన్ కింద శేఖర్రెడ్డి సహా నలుగురిపై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ రామ్మోహన్ రావు కొడుకుతో శేఖర్ రెడ్డికి సంబంధాలున్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ రోజు రామ్మోహన్ రావు కార్యాలయం, బంధవుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.