టోల్ రీ చార్జ్ | toll Re t charging system in Chennai | Sakshi

టోల్ రీ చార్జ్

Feb 24 2015 1:22 AM | Updated on Aug 28 2018 4:00 PM

టోల్ రీ చార్జ్ - Sakshi

టోల్ రీ చార్జ్

రాష్ట్రంలోని జాతీయ రహదారుల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. టోల్ ప్లాజాల్లో గంటల తరబడి వాహనాలు

 రాష్ట్రంలోని జాతీయ రహదారుల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. టోల్ ప్లాజాల్లో గంటల తరబడి వాహనాలు క్యూ కట్టకుం డా సరికొత్త విధానం అమలుకు నిర్ణయించారు. సెల్ రీ చార్జ్ తరహాలో టోల్ రీ చార్జ్ సిస్టమ్‌ను ప్రవేశ పెట్టనున్నారు. తొలి విడతగా చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిలో ఈ విధానం అమల్లోకి రానుంది.  
 
 సాక్షి, చెన్నై :  కన్యాకుమారి నుంచి తిరునల్వేలి, మదురై, తిరు చ్చి, విల్లుపురం, చెన్నై మీదుగా ఆంధ్రప్రదేశ్ వైపు, చెన్నై నుంచి బెంగళూరు మీదుగా జాతీయ రహదారులు ఉన్నాయి. వేల కిలో మీటర్ల మేరకు జాతీయ రహదారుల్ని కలిపే రాష్ట్ర రహదారులు కూడా ఉన్నాయి. ఈ రహదారుల్లో మొత్తంగా 42 టోల్ ప్లాజాల వరకు ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు రద్దీతో ఉంటాయి.  ప్రైవేటు, ప్రభుత్వ వాహనాలు పరుగులు తీస్తుండడంతో టోల్ ప్లాజాల్లో క్యూ కట్టాల్సిన పరిస్థితి. ఇక, మధ్యాహ్నం వేళ ఖాళీ గానే ఉంటాయి.
 
   ప్రధానంగా చెన్నై నుంచి దక్షిణాది జిల్లాల వైపుగా వెళ్లే జాతీయ రహదారుల్లో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ప్రైవేటు ఆమ్నీ బస్సులు, ప్రభు త్వ బస్సులు, లారీలు, ఇతర వాహనాలు దూసు కు వెళ్తుంటాయి. దీంతో జాతీయ రహదారి కిక్కిరిసి ఉండడంతో పాటుగా టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి క్యూ కట్టాల్సిన పరిస్థితి. ఇదే, పరిస్థితి బెంగళూరు వైపు జాతీయ రహదారిలోను ఎదురవుతోంది. టోల్ ప్లాజా ల్లో సమయం వృతా కావడంతో త్వరితగతిన గమ్య స్థానాలకు చేరాలన్న ఆత్రుతతో వాహనాల వేగం పెరుగుతోంది. ఇది కాస్త ప్రమాదాలకు దారి తీస్తున్నది. దీనిని పరిగణనలోకి తీసుకున్న రహదారుల శాఖ సరికొత్త విధానాన్ని అమలు చేయడానికి చర్యలు చేపట్టింది.
 
 టోల్ రీ చార్జ్
 జాతీయ రహదారుల్లో ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించడంతోపాటుగా, టోల్ ప్లాజాల్లో వాహనాలు క్యూ కట్టకుండా సరికొత్త విధానం అమలుకు చర్యలు చేపట్టారు. సెల్ ఫోన్ రీ చార్జ్ తరహాలో టోల్ రీచార్జ్ రూపంలో ఈ విధానం అమల్లోకి రానుంది. ఈ విధానం ద్వారా టోల్ ప్లాజాల్లో నిలబడాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా కేటాయించిన మార్గంలో ముందుకు దూసుకు వెళ్లవ చ్చు. ఈ విధానం మేరకు సంబంధిత వాహనం ముందు, వెనుక భాగంలో స్టిక్కర్లను అంటిస్తారు. ఈ స్టిక్కర్లలోని కోడ్ ఆధారంగా ఆ వాహనం టోల్ ప్లాజా కు వంద మీటర్ల దూరంలోకి రాగానే, ప్రత్యేక మార్గం గేట్లు తెరచుకుంటాయి. దీంతో వాహనాన్ని అక్కడ ఆపాల్సిన అవసరం లేదు. టోల్ రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ స్టిక్కర్ల కేటాయింపు సమయంలో ముందస్తుగా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తం తగ్గుతుండగానే, ఆయా వాహనాలకు కేటాయించిన ప్రత్యేక కోడ్ నెంబర్ల ఆధారంగా సెల్ రీచార్జ్ తరహాలో టోల్ ఫ్లాజాల్లో రీ చార్జ్ చేసుకునేందుకు వీలు ఉంది.
 
 ఈ విషయమై రహదారుల శాఖ అధికారి ఒకరు పేర్కొంటూ, ప్రతి టోల్ ప్లాజాలో ఈ విధానం అమలు నిమిత్తం ప్రత్యేకంగా రెండు మార్గాలు కేటాయించబోతున్నామన్నారు. టోల్ రీచార్జ్ విధానంలో చేరిన వాహనం ఆ మార్గంలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ముందుకు సాగేందుకు వీలుందన్నారు. ముం దుగా చెల్లించిన నగదుతో ఆయా వాహనాల్లోని నెంబర్ల ఆధారంగా  ఆయా టోల్ ప్లాజాల్లో వారి అకౌంట్ల నుంచి నగదును తీసుకోవడం జరుగుతుందన్నారు. వారి అకౌంట్లో నగదు పూర్తయ్యే పరిస్థితి ఉంటే, ముందుగా సేకరించిన మొబైల్ నెంబర్లకు మెసెజ్ పంపనున్నట్లు తెలిపారు. ఈ విధానం మేరకు అన్ని టోల్ ప్లాజాలను ఆన్‌లైన్ పరిధిలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అందు వల్ల ఈ విధానంలో చేరే వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. ఈ విధానాన్ని తొలి విడతగా చెన్నై - బెంగళూరు జాతీయ రహదారిలో మరో వారం పది రోజుల్లో అమలు చేయబోతున్నామన్నారు. ప్రస్తుతం తమ వాహనాలకు ఆ స్టిక్కర్లను అంటించి, ట్రైల్ రన్ నిర్వహిస్తున్నామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement