
మళ్లీ హైదరాబాద్ లో 'రియల్ బూమ్' కు రెక్కలు!
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో మళ్లీ స్థిరాస్తి రంగంపై ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర విభజనతో స్తబ్ధతగా మారిన ఈ రంగం మళ్లీ పుంజుకుంటోంది. మొన్నటి వరకు రాష్ట్ర విభజనతో స్థానికేతరులు ఇక్కడ స్థిరాస్తులు కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో లావాదేవీలు తగ్గాయి. తెలంగాణేతరులు స్థిరాస్తులు, భూముల ధరలపై ఆందోళన చెందినప్పటికీ భూముల ధరలు, విలువలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. అయితే తాజాగా హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా మారుస్తామన్న తెలంగాణ ప్రభుత్వం ప్రకటనతో మళ్లీ రియల్ బూమ్ మరింత పెరగవచ్చని దేశీయ స్థిరాస్తి అభివృద్ధి సమాఖ్య (సీఆర్డీఏఐ) స్పష్టం చేసింది. గత మూడు నెలల్లో రియల్ రంగం 10 శాతం మేర ఊపందుకున్నట్లు పేర్కొంది.
ఇదే పరంపర కొనసాగితే రానున్న కాలంలో రియల్ రంగం మరింత వృద్ధిని సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. రాబోవు ఆరు -ఎనిమిది నెలల్లో 40 శాతం నుంచి 50 శాతం వరకూ రియల్ ఎస్టేట్ ధరలు పెరగవచ్చని తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ లో క్రమంగా భూములు, ప్లాట్ల క్రయ విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈనెల మొదటి వారంలో ఒకేసారి దస్తావేజుల నమోదు సంఖ్య కూడా పెరిగింది.